ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి వేడుకలు.
విశాలాంధ్ర – అనపర్తి : తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులోని ప్రాచీన శ్రీ గోలింగేశ్వరస్వామివారి ఆలయంలో కొలువై ఉన్న శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి షష్టి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం తెల్లవారుజామున తీర్థపు బిందె సేవతో షష్టి వేడుకలను ప్రారంభమైన వేడుకలు 7 రోజుల పాటు జరగనున్నాయి. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు క్యూలో బారులు తీరారు. గోదావరి కాలువలో స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకోవడం ఇక్కడ ఆచారం. దీంతో స్నానఘట్టాలన్నీ జనంతో నిండిపోయాయి. సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదించే ఈ స్వామి ఆలయంలోని పుట్టపై ఉంచిన నాగుల చీరను ధరించి ఆలయం వెనుక నిదురిస్తే స్వామివారు కలలో సాక్షాత్కరించి సంతానాన్ని ప్రసాదిస్తారని భక్తులు ప్రగాఢ విశ్వాసం. దీంతో సంతానం లేని వారు అధిక సంఖ్యలో ఆలయం వెనుక నాగులు చీర ధరించి నిద్ర చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బిక్కవోలు కుమార సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో షష్టి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని శాఖలను సమన్వయ చేసుకుని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా షష్టి ఉత్సవాలు జరుపుతున్నట్లు చెప్పారు. ఇటీవల ఆలయాల పద్ధతి జరిగిన అవాంఛనీయ సంఘటనలు దృష్టిలో ఉంచుకుని పోలీస్ శాఖ పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారన్నారు. గతానికి భిన్నంగా క్యూలైన్ విధానాన్ని మార్చి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసామన్నారు.


