విశాలాంధ్రవిజయవాడ: లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి ఇండియా కూటమి అభ్యర్థులనే గెలిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ పిలుపునిచ్చారు. మోదీ పదేళ్ల పాలనలో రాజ్యాంగానికి విఘాతం ఏర్పడుతున్న పరిస్థి తుల్లో కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పాటయ్యాయని తెలిపారు. ఇండియా కూటమి బలపర్చిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నిర్వహించిన స్కూటర్ ర్యాలీలో నారాయణ పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ, వైసీపీలో ఏ ఒక్కటీ అధికారం చేపట్టినా బీజేపీకి నష్టం లేదన్నారు. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరిపై కేసులు ఉన్న కారణంగా వారు మోదీ చేతిలో కీలుబొమ్మలుగా మారతారని చెప్పారు. అధికారం కోసం బీజేపీ ఎంతకైనా తెగిస్తుందన్నారు. మహారాష్ట్రలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చి తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. బీజేపీ రాష్ట్రాలను తన గుప్పెట్లో పెట్టుకునేందుకు రాబోయే రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలను పడేస్తుందని హెచ్చరించారు. ఆంధ్ర ప్రదేశ్లో 10 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిస్తే అధికార పార్టీలో చీలిక తెచ్చి తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నారాయణ తెలిపారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందటానికి మొదట అయోధ్య రాముడిని ప్రచారం చేశారని, దాన్ని ప్రజలు పట్టించుకోలేదన్నారు. తరువాత కాంగ్రెస్ గెలిస్తే హిందూ మహిళల మంగళసూత్రాలు తాకట్టు పెట్టుకుంటారని ప్రచారం చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందన్నారు. దీంతో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రధాని మోదీ, అమిత్ షా కొత్త ప్రచారం ప్రారంభించారని చెప్పారు. ఉత్తర భారతదేశంలో బీజేపీ గ్రాఫ్ బాగా పడిపోయిందన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామనటం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించి, ఒక కమిషన్ ఏర్పాటు చేసి, దాని నివేదిక ఆధారంగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తా మన్న వారిపై కేసు నమోదు చేయాలన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాల ద్వారా అధికారంలోకి రావటానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించటం సహజం అన్నారు. అయితే పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థి కులాలు, మతాలవారీగా ఏసీ కళ్యాణ మంటపాలకు పిలిపించి ఓట్లు అడగటాన్ని ప్రజలు గర్హిస్తున్నారని తెలి పారు. బ్యాంకులకు రూ.5,700 కోట్లు ఎగనామం పెట్టిన బ్యాంకు దొంగలు పోటీ చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వారికి ఓటు వేస్తే విజయవాడ నగర ప్రతిష్ఠ దెబ్బతింటుందన్నారు. ప్రజలు ఆలోచించి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ‘కంకి
కొడవలి’ గుర్తుపై, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి వల్లూరు భార్గవ్కు ‘హస్తం’ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు మాట్లాడుతూ ఇక్కడ జరిగే ఎన్నికలు ధన బలానికి, జన బలానికి మధ్య జరుగుతున్న పోటీ అన్నారు. నియోజకవర్గ సరిహద్దులు తెలియని వారు డబ్బు ఉంది కదా అని ఇక్కడికి వచ్చి పోటీ చేస్తే ఓట్లు వేస్తారనుకోవటం పొరపాటు అని తెలిపారు. నిత్యం ప్రజల మధ్య ఉండే జి.కోటేశ్వరరావు గెలిపించాలని కోరారు. ర్యాలీ ముగింపు సభలో పశ్చిమ నియోజకవర్గ సమన్వయ కమిటీ కన్వీనర్ దోనేపూడి శంకర్ మాట్లాడుతూ మైనార్టీల హక్కుల రక్షణ కోసం ఇండియా కూటమి అభ్యర్థులు చట్టసభల్లో ఉండా ల్సిన అవసరం ఉందన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వస్తే మత విద్వేషాలు కలిగిస్తారని చెప్పారు. అంబేద్కర్ రాసిన లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని మార్చేస్తారని హెచ్చరించారు. భవానీపురం దర్గా సెంటర్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ స్వాతి థియేటర్, ఊర్మిళా నగర్, ఆర్టీసీ వర్క్షాపు, కుమ్మరిపాలెం సెంటర్, చెరువు సెంటర్, సితార సెంటర్, ఎర్రకట్ట బ్రిడ్జి, చిట్టినగర్, శ్రీనివాసమహల్, గణపతిరావు రోడ్డు, పంజా సెంటర్, ఎర్రకట్ట, మసీదు సెంటర్, కేదారేశ్వరపేట, పెజ్జోనిపేట, పూర్ణానందపేట మీదుగా కరుణా హోటల్ సెంటర్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అక్కినేని వనజ, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, సీపీఎం నాయకులు బోయ సత్యబాబు, సీపీఐ విజయవాడ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె.వి.భాస్కరరావు, తాడి పైడియ్య, మూలి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.