. ఆప్ అభ్యర్థే విజేత
. ఉద్దేశపూర్వకంగానే ఫలితాలు తారుమారు
. రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలి
. చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు
న్యూదిల్లీ : చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి విజయం సాధించినట్లు సుప్రీంకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. ఫలితాలను ఉద్దేశ పూర్వకంగా తారుమారు చేసినట్లు స్పష్టమైందని పేర్కొంది. చెల్లనివిగా పేర్కొన్న ఎనిమిది బాలెట్లు ఆప్కు వచ్చినవిగా గుర్తించింది. వాటిని కలిపి లెక్కించాలని ఆదేశాలిచ్చింది. ఆపై ఫలితాలు ప్రకటించాలని పేర్కొంది. దీనిని బట్టి ఆప్ అభ్యర్థి గెలుస్తారని వ్యాఖ్యానించింది. రిటర్నింగ్ అధికారి తీరును ఆక్షేపించింది. కోర్టును ధిక్కరించినట్లు రిటర్నింగ్ అధికారి అనిల్ మసీప్ాని దుయ్యబట్టింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు దాఖలైన పిటిషన్ను సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. మొత్తం ఎన్నికల ప్రక్రియను చెల్లనిదిగా ప్రకటించడం లేదని, ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అవకతవకలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నామని తెలిపింది. జనవరి 30న ఫలితాలు ప్రకటించారని, 36లో నుంచి ఎనిమిది ఓట్లు చెల్లనివిగా చూపారని సీజేఐ అన్నారు. ‘మొదటి అభ్యర్థి తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించు కున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీనిని హైకోర్టు ధ్రువీకరించింది. మేయర్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు మొత్తం 35 మంది కౌన్సిలర్లు అర్హులు కాగా కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన ఎంపీకీ అర్హత ఉందడంతో మొత్తం 36 ఓట్లు ఉన్నాయి. పిటిషనర్ వద్ద 12 ఓట్లు వుంటే ప్రతివాది వద్ద 16 ఓట్లు వున్నాయి. పంజాబ్, హరియాణా హైకోర్టును ఆశ్రయించగా ఎన్నికల ఫలితాలపై స్టే విధించేందుకు నిరాకరించింది. విచారణ మూడు వారాలకు వాయిదా పడిరది’ అని సీజేఐ అన్నారు. ‘ఈ బ్యాలెట్ పత్రాలు ఎందుకు చెల్లవో చెప్పగలరా అని మస్హీను ప్రశ్నించారు. అవి ఆప్ అభ్యర్థి అభ్యర్థికి వచ్చినవిగా స్షష్టమైంది. వీడియోలో కనిపిస్తున్నట్లు వాటిపై అధికారి గీత గీశారని సీజేఐ అన్నారు. కేసులో న్యాయవాదులకు ఆ బ్యాలెట్లు చూపించారు. లెక్కింపు ప్రక్రియ వీడియోను రెండోసారి వీక్షించారు. దీనిని అందరికీ చూపించండి. అందరికీ కాస్త వినోదం మంచిదే అని సీజేఐ చమత్కరించారు. ‘ఓట్ల లెక్కింపు వీడియోను మరోమారు ప్రదర్శించాల్సిందిగా సూచిస్తూ మొత్తం వద్దు లేదంటే సాయంత్రం 5.45గంటల వరకు ఇక్కడే ఉండాలి’ అని వ్యాఖ్యానించారు. ‘కుల్దీప్ కుమార్, మనోజ్ కుమార్ చూడండి ఇక్కడ ఏం జరుగుతోంతో… ఎనిమిది బ్యాలెట్లు చెల్లనివిగా చేశారు. ఆ ఎనిమిది ఓట్లు కుల్దీప్కు పడ్డాయి. ఆర్ఓ సంతకం చేసి కింద గీత గీశారు. అనేక చోట్ల అదే చేశారు’ అని అన్నారు. ఆప్ అభ్యర్థి తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఫ్వీు వాదనలు వినిపస్తూ మస్హి తీరును తీవ్రంగా విమర్శించారు.
మస్హి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రొహత్గీ వాదిస్తూ ‘అక్కడ చిన్న చుక్క స్పష్టంగా కనిపిస్తోంది. మరికొన్ని బ్యాలెట్లు పై నుంచి మడపపెట్టి ఉన్నాయి. అందుకే వాటిని చెల్లనివిగా తేల్చారు. బయట గొడవ జరుగుతోంది కాబట్టి ఆయన కెమెరా వైపు చూశారు. తప్పు చేసిన వ్యక్తి ఎవరూ కెమెరా వైపు చూడరు’ అని అన్నారు. దీనికి సీజేఐ స్పందిస్తూ ఓట్లను తిరిగి లెక్కించాలని, చెల్లని 8 ఓట్లు కూడా కలిపి లెక్కించాలని అన్నారు. దీనికి తాను రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనని, వేరొకరికి ఈ పని అప్పగించాలని రొహత్గీ స్పందించారు.
రిటర్నింగ్ అభ్యర్థుల తరపు సీనియర్ న్యాయవాది మనిందర్ సింగ్ వాదనలు వినిపిస్తూ సెక్షన్ 38(3)ని గురించి ప్రస్తావించగా సింఫ్వీు అడ్డుకున్నారు. న్యాయంగా ఎన్నికైతేనే ఆ సెక్షన్ వర్తిస్తుందని తెలిపారు. అన్ని వైపుల వాదనలు విన్న తర్వాత చెల్లని ఓట్లు కలిపి లెక్కించిన తర్వాత విజేత ఎవరో చెప్పండని కోర్టు ఆదేశించింది. ఆప్ అభ్యర్థి విజేతగా నిలిచినట్లు తీర్పులో సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఇదిలావుంటే తగినంత సంఖ్యా బలం(16) లేకపోయినా బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకర్ అనూహ్యంగా గెలవగా, కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ ఓడిపోయారు. ఎన్నికల్లో మోసం జరిగిందని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఎన్నికల అధికారి బ్యాలెట్ పత్రాలపై పెన్నుతో ఏదో రాసి.. వాటిలో కొన్నింటిని చెల్లకుండా చేశారని కాంగ్రెస్, ఆప్ ఆరోపించాయి.