రాబోయే ఎన్నికల్లోనూ మాదే అధికారం
ఓటమి బాధలో బీఆర్ఎస్: మహేశ్కుమార్ గౌడ్
విశాలాంధ్ర – హైదరాబాద్: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రస్తుతం జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. మంత్రులతో పాటు ఇంచార్జ్లు ఉన్న ప్రతీ ఒక్కరూ బాగా పని చేశారని కొనియాడారు. గాంధీభవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ లో ఓడిపోతున్నామనే బాధతో బీఆర్ఎస్ నేతలు మట్లాడుతున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాల అమలు మా పార్టీ అభ్యర్థి కలిసొచ్చిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో హైకోర్టు ఆదేశాలు పాటిస్తామన్నారు. బీసీలకు 42 శాతం చట్టబద్ధకంగా చేయాలని అనుకున్నాం… కానీ కేంద్రంలోని బీజేపీ అడుగడుగునా అడ్డం పడుతుందని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తపన అని పేర్కొన్నారు. బీసీలు బాగుపడొద్దు అన్న వైఖరితో బండి సంజయ్, కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. డీసీసీ అధ్యక్షుల ప్రకటన ఏ క్షణమైన రావొచ్చని, సోషల్ మీడియా దుష్ప్రచారం నమ్మవద్దన్నారు. బీహార్ లో మహాఘఠ్బంధన్ గెలుస్తుందన్న నమ్మకం ఉందన్నారు. త్వరలో ఓట్ చోరీపై కమిటీ వేస్తామని, ఓట్ చోరీ ని అధిగమించి గెలవాలన్నదే కాంగ్రెస్ పార్టీ తాపత్రయమన్నారు.


