విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మరణ ధృవీకరణ సర్టిఫికెట్ కావాలంటే పంచాయతీ కార్యదర్శికి ముడుపులు ఇచ్చుకోవాల్సిందేనని సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక సిపిఐ కార్యాలయం నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దకడబూరు గ్రామంలో ఎవరికైన మరణ ధృవీకరణ పత్రం కావాలంటే పంచాయతీ కార్యదర్శి సాయితేజ దగ్గరకు వెళ్తే 300 రూపాయలు నుంచి 1000 రూపాయలు వరకు ముడుపులు వసూలు చేస్తున్నారని, దీంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రజలు అడిగితే పరిష్కరించడు కానీ డబ్బులు వసూలు చేయడంలో ముందు ఉంటారన్నారు. పంచాయతీ కార్యదర్శి గ్రామంలో చాలా చోట్ల డ్రైనేజీలు పూడికతో నిండిపోయి మురుగు నీరు రోడ్డుపై ప్రవహిస్తున్నా, వీధి దీపాలు సరిగా పనిచేయక పోయినా పట్టించుకోవడం లేదన్నారు. చెడిపోయిన బోర్లను మరమ్మతులు చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పట్టించుకోని పంచాయతీ కార్యదర్శిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


