: సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి. జాఫర్
విశాలాంధ్ర-రాప్తాడు : సమయపాలన పాటించకుండా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్న పెట్రోల్ బంకు దుస్థితిపై వార్తా కవరేజీలో భాగంగా ఫొటోలు తీసినందుకు విశాలాంధ్ర విలేకరి శ్రీమివాసులును ఫోన్ లో బెదిరించడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి. జాఫర్ తీవ్రంగా ఖండించారు.
గోవిందరాజులు అనే వ్యక్తి ఫోన్ బెదిరింపులు:
బంకు నిర్వాహకుడు స్వరూప్.. అనంతపురానికి చెందిన గోవిందరాజులు అనే వ్యక్తితో “విశాలాంధ్ర విలేకరి శ్రీనివాసులను ఫోన్లో బెదిరించాడు. గోవిందరాజులు అనే వ్యక్తి విలేకరికి ఫోన్ చేసి తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగాడు. “బంకు వద్దకు వెళ్లి ఫొటోలు తీసుకునేందుకు నీకేం సంబంధం నా వద్ద దీనికి సంబంధించి ప్రూఫ్స్ ఉన్నాయి” అంటూ బెదిరిస్తూ, తనకు ఉన్నతాధికారులు మరియు రాజకీయ అండదండలు ఉన్నాయంటూ దబాయించే ప్రయత్నం చేశాడు.
ఈ ఘటనపై సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి. జాఫర్ తీవ్రంగా స్పందించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ, అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని నిష్పక్షపాతంగా పనిచేసే పాత్రికేయుల పట్ల ఇలాంటి బెదిరింపులకు దిగడం అత్యంత శోచనీయమన్నారు. బంకు నిర్వాహకుల తప్పులను కప్పిపుచ్చుకోవడానికి విలేకరులపై అక్రమంగా నిందలు వేయడం, వెనుక ఉండి బెదిరింపులకు గురిచేయడం వంటి చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు. నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులకు సీపీఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
జాయింట్ కలెక్టర్ స్పందించి తనిఖీలు చేపట్టాలి:
నిబంధనలు ఉల్లంఘిస్తూ, మౌలిక వసతులు కల్పించకుండా ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్న ఇలాంటి పెట్రోల్ బంకులను జాయింట్ కలెక్టర్, లీగల్ మెట్రాలజీ మరియు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి తనిఖీలు చేయాలని జాఫర్ డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా బంకుల నిర్వహణలో లోపాలు ఉన్నట్లు తేలితే నిబంధనల ప్రకారం వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు.


