విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : డీఎస్సీపై వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుందని టీడీపీ మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున విమర్శించారు. బుధవారం పెద్దకడబూరులో ఆమె విలేకరులతో మాట్లాడుతూ గత ఐదు ఏళ్ళలో ఒక్క డీఎస్సీ కూడా వేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, పార్టీ నాయకులకు కూటమి ప్రభుత్వంపై మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సీపై పెట్టి, 148 రోజుల్లోనే అత్యంత పారదర్శకంగా 16,347 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసి నియామక పత్రాలు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని కొనియాడారు. 5 లక్షల మంది ధరఖాస్తు చేసి, 3 లక్షల మంది క్వాలిఫై అయిన మెగా డిఎస్సీపై వైసీపీ నేతలు ఆధారాలు లేకుండా చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మండల రూపురేఖలు మారుతున్నాయని, ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రాలయం నియోజకవర్గ ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో అమ్మ ఒడి ఇంట్లో ఒక్కరికి ఇస్తే యువనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఇంట్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం 15000 వేల రూపాయలు ఇస్తుందన్నారు. ఇంటర్ విద్యార్థులకు నివాస వసతి, మధ్యాహ్న భోజనం, డిజిటల్ సేవలు వంటి కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు ఫేక్ ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.


