
- కలెక్టరేట్ల ఎదుట ఏఐఎస్ఎఫ్ధ ర్నాలు విజయవంతం
- గుంటూరు, తిరుపతి, విజయనగరంలో ఉద్రిక్తత
- పోలీసులు… విద్యార్థి సంఘం నేతల మధ్య వాగ్వాదం
- భారీ ప్రదర్శనలతో కూటమిపై తిరుగుబావుటా
- విద్యార్థులను మోసగించిన లోకేశ్ : నాసర్ జీ, వలరాజు విమర్శ
విశాలాంధ్ర బ్యూరో`గుంటూరు/ తిరుపతి/విజయనగరం : విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్, విద్యార్థి లోకం కదంతొక్కింది. అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) పిలుపులో భాగంగా రాష్ట్రంలోని విజయనగరం, గుంటూరు, తిరుపతి, కడప, కర్నూలు జిల్లా కలెక్టరేట్లు, అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి, కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం కలెక్టరేట్ల ఎదుట బుధవారం జరిగిన ధర్నాలు దద్దరిల్లాయి. అంతకుముందు భారీ ప్రదర్శనగా విద్యార్థిలోకం కలెక్టరేట్ల వద్దకు తరలివచ్చింది. రాష్ట్రంలోని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తూర్పారబట్టారు. ఎన్నికల సమయంలో యువగళం పేరిట ప్రస్తుత మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీలను విస్మరించారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విద్యార్థి లోకాన్ని మంత్రి నారా లోకేశ్ దగా చేశారని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా సమితి అధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ వద్ద ఆందోళనలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ, తిరుపతిలో రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వలరాజు పాల్గొన్నారు. గుంటూరు, తిరుపతి, విజయనగరం కలెక్టరేట్ల వద్ద పోలీసులకు, ఏఐఎస్ఎఫ్ నేతలకు మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. కలెక్టరేట్ల గేట్ల పైకి విద్యార్థులు ఎక్కి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. వారిని పోలీసులు నిలువరించేందుకు ప్రయత్నించగా, విద్యార్థులకు పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. ఈ సందర్భంగా బందెల నాసర్ జీ, జి.వలరాజు మాట్లాడుతూ రూ.6,400 కోట్ల పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసేంత వరకు తమ ఆందోళనలు ఉధృతం చేస్తామని అన్నారు. అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నికల్ ఐటీఐ, కళాశాలలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు విద్య అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు జీవో నంబరు 77 రద్దు చేయాలన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలన్న లోకేశ్ మాటలకు, జీవోలకు పొంతన లేదన్నారు. ఈ ధర్నాలలో గుంటూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బన్ని, యశ్వంత్, తిరుపతి జిల్లా కార్యదర్శి ప్రవీణ్, నాయకులు చిన్న, కృష్ణాజిల్లాలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.సాయికుమార్, రాష్ట్ర నాయకులు శివకుమార్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీలత, సాధిక్, విద్యార్థులు పాల్గొన్నారు. కడపలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.నాగభూషణం, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అశోక్ బత్తల అరుణ్, అన్నమయ్య జిల్లాలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి మాధవ్, నాయకులు గంగా, విజయనగరంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ఫణీంద్ర, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రావణ్, సుమన్, కర్నూలులో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సోమన్న షాబీర్ బాషా, నగర కార్యదర్శి అశోక్, అభి పాల్గొన్నారు.


