లక్నో: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్కు యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయనతో పాటు ట్రస్ట్ మాజీ సభ్యుడు అనిల్ మిశ్రాకు కూడా క్లీన్చిట్ ఇచ్చింది. చంపత్ రాయ్కు విరాళాల చోరీ కేసుతో ఎలాంటి సంబంధం లేదని సిట్ తన తొలి నివేదికలో పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సిట్ తన నివేదికను రాష్ట్ర హోంశాఖకు ఇవ్వగా… ఈ నివేదిక పరిశీలన అనంతరం తదుపరి చర్యల కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు అందించినట్లు సమాచారం. యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నివేదికలో చంపత్ రాయ్తో పాటు మాజీ ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా పేర్లు లేవని సమాచారం. విరాళాల వ్యవహారంలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో వీరిద్దరూ జూన్ 27న ట్రస్ట్లోని తమ పదవులకు రాజీనామా చేశారు. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అభ్యర్థన మేరకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో జూన్ 13న తొలి సిట్ను ఏర్పాటు చేశారు. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో ఈ బృందం దర్యాప్తు చేపట్టింది. అలాగే, రామ మందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై సుప్రీంకోర్టు అధ్వర్యంలో మరో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ నిర్వహిస్తోంది. దర్యాప్తును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సోమవారం సిట్ను ఆదేశించింది.


