మహిళల పై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా కాంగ్రెస్ ధర్నా
విశాలాంధ్ర – రాజమండ్రి సిటి ; ఏపి లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు అరికట్టాలంటూ రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం ఉదయం ధర్నా చేశాయి. . ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టి.కె. విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ, స్థానిక గణేష్ చౌక్ లోని బిసి బాలికల హాస్టల్ లో పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికను ఇద్దరు యువకులు అత్యాచారం చేసిన ఘటనకు సంబందించి నిందితులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆ బాలికను సాయంత్రం పూట బయటకు పంపించిన వార్డెన్ ను కూడా ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఎక్కడ చూసినా మైనర్ బాలికల మీద అత్యాచారాలు పెరిగిపోయాయి. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం గంజాయిని, మద్యాన్ని అరికట్టపోవడం వల్లనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ పనితీరు ఘోరంగా ఉందన్నారు. జెటి రామారావు మాట్లాడుతూ లాడ్జి టిడిపి వారికి చెందైనందున వల్ల సీజ్ చేయలేదన్నారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శారద మాట్లాడుతూ ప్రభుత్వ పని తీరు దారుణంగా ఉందని , ఇదెక్కడి సర్కార్ అని దుమ్మెత్తి పోసారు. రక్షణ ఇవ్వలేని ప్రభుత్వం ఎందుకంటూ జిల్లా కాంగ్రెస్ ప్రచార కన్వీనర్ డాక్టర్ వడయార్ అన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని నియోజకవర్గ నిడదవోలు కాంగ్రెస్ ఇన్ చార్జ్ భద్రం దొర డిమాండ్ చేశారు.


