Homeఅంతర్జాతీయంఏషియన్ గేమ్స్ కోసం భారత మహిళల క్రికెట్ జట్టు ప్రకటన.. టీమ్‌లో ఒకే ఒక్క మార్పు

ఏషియన్ గేమ్స్ కోసం భారత మహిళల క్రికెట్ జట్టు ప్రకటన.. టీమ్‌లో ఒకే ఒక్క మార్పు

- Advertisement -

రాబోయే 2026 ఆసియా క్రీడల కోసం బీసీసీఐ నేడు 15 మంది సభ్యులతో కూడిన భారత మహిళల క్రికెట్ జట్టును ప్రకటించింది. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన జట్టును ముందుండి నడిపించనున్నారు. జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న ఈ మెగా ఈవెంట్‌లో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. గతంలో చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన ఎడిషన్‌లో భారత జట్టు చారిత్రాత్మక స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

జట్టులో ఒకే ఒక్క మార్పు
ఇటీవల జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాల్గొన్న జట్టుపైనే సెలక్షన్ కమిటీ పూర్తి విశ్వాసం ఉంచింది. ఆ జట్టులో ఒకే ఒక్క మార్పు చేసింది. వికెట్ కీపర్ యస్తికా భాటియా స్థానంలో ఎడమచేతి వాటం బ్యాటర్, వికెట్ కీపర్ అయిన జి. కమలినికి జట్టులో అవకాశం కల్పించారు. మిగతా జట్టు యథాతథంగా కొనసాగుతోంది. ఇది జట్టు కూర్పులో స్థిరత్వాన్ని సూచిస్తోంది. బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌తో పాటు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ కీలక పాత్ర పోషించనున్నారు. స్టార్ ఆల్-రౌండర్ దీప్తి శర్మ మిడిల్ ఆర్డర్‌కు బలం చేకూర్చనుంది. వికెట్ కీపింగ్ బాధ్యతలను రిచా ఘోష్ ప్రధానంగా మోయనుండగా, ఆమెకు బ్యాకప్‌గా కమలిని ఎంపికైంది.

బౌలింగ్ విభాగం.. శ్రేయాంక ఫిట్‌నెస్‌పై సందిగ్ధత
పేస్ బౌలింగ్ విభాగానికి స్వింగ్ స్పెషలిస్ట్ రేణుకా సింగ్ ఠాకూర్, అనుభవజ్ఞురాలైన అరుంధతి రెడ్డి నాయకత్వం వహించనున్నారు. స్పిన్ విభాగంలో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ రాధా యాదవ్, ఆఫ్-స్పిన్నర్ శ్రేయాంక పాటిల్, యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, తెలుగ‌మ్మాయి శ్రీ చరణి ఉన్నారు. అయితే, యువ ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్ ఎంపిక ఆమె ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. గతంలో చీలమండ గాయం కారణంగా ఆమె టీ20 ప్రపంచకప్‌కు దూరమైంది. ఆమె పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తేనే తుది జట్టులో కొనసాగుతుంది.

2010లో గ్వాంగ్‌జౌలో జరిగిన క్రీడల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన క్రికెట్, 2014లో ఇంచియాన్‌లోనూ కొనసాగింది. 2018 జకార్తా గేమ్స్‌లో చోటు దక్కించుకోలేకపోయినా, 2022లో విజయవంతంగా పునరాగ‌మనం చేసింది. ఇప్పుడు వరుసగా రెండోసారి ఆసియా క్రీడల్లో క్రికెట్ భాగం కాబోతోంది.

ఆసియా క్రీడలకు భారత మహిళల జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి. కమలిని (వికెట్ కీపర్), భారతి ఫుల్మాలి, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్ (ఫిట్‌నెస్‌పై ఆధారపడి), రాధా యాదవ్, నందిని శర్మ.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు