Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ప్రజా ఉద్యమాలపై నిర్బంధం తగదు

జీఓఎంఎస్‌ నెం.1 ని రద్దు చేయాలి
వామపక్షాల ఆధ్వర్యంలో జీఓ ప్రతుల దహనం, నిరసన
4జీడీఆర్‌1 – నిరసన తెలుపుతున్న వామపక్ష నాయకులు

విశాలాంధ్ర – గూడూరు : ప్రజా ఉద్యమాలపై నిర్భంధం తగదని, జీఓఎంఎస్‌. నెం. 1 ని వెంటనే రద్ధు చేయాలని కోరుతూ బుధవారం గూడూరు పట్టణంలోని టవర్‌ క్లాక్‌ సమీపంలో ఉన్న అంబేద్కర్‌ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. జీఓఎంఎస్‌.నెం. 1 ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర? సభ్యులు సీహెచ్‌. ప్రభాకర్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటిష్‌ కాలంనాటి 1861 యాక్ట్‌ ను అమలు చేస్తూ ప్రజా పోరాటాలను నిర్వీర్యం చేసేందుకు చర్యలు తీసుకోవడం తగదన్నారు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జీ. శశికుమార్‌ మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి సీఎం కాక ముందు రోడ్లపై ప్రజా పోరాటాలు చేయలేదా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై స్పందించాల్సిన సీఎం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించడం దారుణమన్నారు. జగన్‌ నియంతృత్వ పాలనకు చమరగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. సీపీఎం పట్టణ కార్యదర్శి పామంజి మణి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కందుకూరు, గుంటూరు పర్యటనల తొక్కిసలాటలో కార్యకర్తలు చనిపోవడాన్ని సాకుగా చూపి ధర్నాలు, సదస్సులు, ర్యాలీలు నిర్వహించేందుకు వీలు లేకుండా జీఓ తీసుకురావడం అన్యాయమన్నారు. వామపక్ష పార్టీలుగా దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీపీఐ పట్టణ కార్యదర్శి షేక్‌. కాలేషా మాట్లాడుతూ రాష్ట్రంలో పాలకుల వైఖరిని ప్రశ్నిస్తున్న, బడుగు, బలహీన వర్గాల పక్షాన ఉంటూ పోరాటాలు చేస్తున్న వామపక్ష పార్టీల గొంతు నొక్కేందుకు, రానున్న ఎన్నికలలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టకుండా ఉండేందుకు 1861 బ్రిటిష్‌ యాక్ట్‌ ను ఆధారంగా చేసుకుని జీఓ చేయడం దారుణమన్నారు. తుగ్లక్‌ లా వ్యవహరిస్తున్న సీఎంకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. చంద్రబాబు పర్యటనలో అమాయక ప్రజల మృతి వంద శాతం ప్రభుత్వ నిర్లక్ష్యమేనన్నారు. సన్న సందుల్లో సమావేశాలకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. పోలీసుల పటిష్ట భద్రత ఎందుకు కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక జీఓను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రంలో అన్ని పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. అంతకుముందు రాజ్యాంగాన్నా కాపాడుకుందాం, సీఎం నిరంకుశ వైఖరి నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ చిల్లకూరు మండల శాఖ కార్యదర్శి గుండాల రమేష్‌, సీపీఎం నాయకులు ఆర్‌. శ్రీనివాసులు, పుట్టా శంకరయ్య, రాజా, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి ఎంబేటి చంద్రయ్య, ఇన్సాఫ్‌ సమితి రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ షేక్‌. జమాలుల్లా, ఆటో యూనియన్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img