తెలంగాణ సర్కారుకు సుప్రీంలో ఎదురుదెబ్బ
న్యూదిల్లీ: పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. పోలవరం ప్రాజెక్టు, గోదావరి నదీ జలాల పంపిణీ, బనకచర్ల పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో లోపాలు ఉన్నాయని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం కోరినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడానికి విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. అంతేకాకుండా తెలంగాణ కోరినట్లుగా ఎటువంటి మధ్యంతర ఉపశమనం కల్పించలేమని తెలిపింది. అయితే ఈ పిటిషన్ను సరిదిద్దిన తర్వాతే విచారణ చేపడతామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు, కృష్ణా నదీ జలాల వినియోగం, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ అంశాలపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాలని, మధ్యంతర (ఇంజంక్షన్) ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్లో 15 మంది ప్రతివాదులు ఉన్నారని కూడా ఆయన కోర్టుకు తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ప్రధాన పిటిషన్లో తీవ్ర సాంకేతిక లోపాలు ఉన్నాయని సుప్రీం కోర్టు తెలిపింది. ప్రాథమిక లోపాలు సరిదిద్దకముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం గానీ, మధ్యంతర ఉత్తర్వులు (ఇంజెక్షన్/స్టే) ఇవ్వడం గానీ సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ముందుగా పిటిషన్లోని లోపాలను సవరించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ఆ తర్వాతే మిగిలిన అంశాలపై విచారణ చేపడతామని పేర్కొంది. అనంతరం కేసు విచారణను వాయిదా వేసింది.


