స్పందన హాస్పిటల్ డాక్టర్ బషీర్
విశాలాంధ్ర-ధర్మవరం : జన విజ్ఞాన వేదికలో సభ్యులుగా చేరి ప్రజాసైన్స్ ఉద్యమంలో భాగస్వామ్యులు కావాలని స్పందన హాస్పిటల్ డాక్టర్ బషీర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని సూర్య హై స్కూల్లో ఆదివారం జెవివి సభ్యత్వ గోడపత్రికలను బషీర్ తో పాటు జెవివి నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ బషీర్, రాష్ట్ర కార్యదర్శి మహేంద్రారెడ్డి, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు లు మాట్లాడుతూ విద్యార్థులు, సైన్స్ ఉపాధ్యాయులు, సైన్స్ అభిమానులు జెవివి లో సభ్యులుగా చేరితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నవని తెలిపారు. మనిషి ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించలే శక్తి కేవలం మనిషికే ఉందని, ఆ సమస్యలకు పరిష్కారాలు కూడా సమాజములోనే ఉంటాయని తెలిపారు. సామాజిక అంశాల విశ్లేషణ, అధ్యయనాలను, శాస్త్రీయ హేతువాద దృక్పథంతో చేసే ఆలోచనని, ప్రజానికములో పోద్రి చేయాలన్న ఆశయంతో పని చేసే ప్రజాసైన్స్ ఉద్యమ మే జన వేదిక అని తెలిపారు. హేతు విరుద్ధ శక్తుల పట్ల ప్రజలను నిరంతరము అప్రమత్తం చేయడమే మా కర్తవ్యం అని తెలిపారు. నేడు శాస్త్ర విజ్ఞానం అనేక రూపాలలో దూసుకుపోతున్న, మధ్యయుగాల చాందస భావాలు, ప్రజానీకాన్ని విజ్ఞాన ఫలాలను అందుకోనీకుండా చేస్తున్నాయని మండిపడ్డారు. ఒక మానవీయమైన, న్యాయమైన, శాస్త్ర సమ్మతమైన సమాజాన్ని కోరుకునే జ్ఞాన విజ్ఞాన వేదిక, ప్రజల వైపే నిలబడి, వికేంద్రీకృత అభివృద్ధి కొరకై తనదైన రీతిలో స్పందిస్తున్నదని వారు తెలిపారు. నేటి సమాజంలో పాత, కొత్తల మధ్య సత్యము, అసత్యమల మధ్య పోరాటం నిరంతరం కొనసాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి చంద్రశేఖర్ రెడ్డి, పట్టణ కార్యదర్శి నరేంద్ర, లోకేష్, సురేష్, నాగేంద్ర, మల్లికార్జున, వాసు, కుమార్, కలందర్, పర్వతయ్య తదితరులు పాల్గొన్నారు.