విశాలాంధ్ర – పెద్దకడబూరు : కోతలు లేని నాణ్యమైన విద్యుత్ ను ఈ ఏడాది సరఫరా చేస్తున్నామని విద్యుత్ శాఖ ఎస్ఈ ఉమాపతి స్పష్టం చేశారు. బుధవారం పెద్దకడబూరులోని విద్యుత్ సబ్ స్టేషన్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఈ ఉమాపతి మాట్లాడుతూ ఈ ఏడాది అన్ని రంగాలకు కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అగ్రికల్చర్ కింద రూ. కోటి 70 లక్షలు, గృహ అవసరాల కింద 3.2 కోట్లు, హంద్రీనీవా కింద 2500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయన్నారు. హంద్రీనీవా కింద వెయ్యి కోట్లు వసూలు అయ్యాయని తెలిపారు. పెద్దకడబూరు మండలంలో అగ్రికల్చర్ కింద రూ. 9 లక్షలు బకాయి ఉందన్నారు. విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించి నాణ్యమైన విద్యుత్ సరఫరాకు దోహదపడాలని కోరారు. అగ్రికల్చర్ కు పగటి పూట 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. అనంతరం సబ్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న విద్యుత్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యుత్ శాఖ నియమ నిబంధనలను సిబ్బంది పాటిస్తూ పని చేయాలని సూచించారు. అజాగ్రత్తగా ఉండొద్దని, విద్యుత్ కు సంబంధించిన పనులలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఈ నాగవేంద్రం, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.