విశాలాంధ్ర -ఆస్పరి : మాదిగల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న ఎమ్మార్పీఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండల కేంద్రంలో ఎం ఎస్ పి, ఎమ్మార్పీఎస్ ల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా ఎం ఎస్ పి జిల్లా కో కన్వీనర్ సంజప్ప మాదిగ ఎమ్మార్పీఎస్ దండోరా పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎం ఎస్ పి జిల్లా కో కన్వీనర్ సంజప్ప మాదిగ, మండల కన్వీనర్ రామాంజనేయులు మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు చిన్న సంజన్న మాదిగ, డివిజన్ మాదిగ న్యాయవాదుల కన్వీనర్ మనోజ్ మాదిగ ల చేతుల మీదుగా మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకల కేక్ ను కట్ చేసి స్వీట్లు పంచి, శుభాకాంక్షలు తెలియజేస్తూ.. డప్పుల వాయుద్యాలతో బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ ఆవిర్భావం నుండి నేటి వరకు ఏబిసిడి వర్గీకరణ కోసం, సమాజంలో ఉండే అణగారి వర్గాల సంక్షేమం అభ్యున్నతి కోసం అనేక పోరాటం చేసిన ఘనత ఎమ్మార్పీఎస్ కే దక్కిందన్నారు. వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు పింఛన్లు, గుండె జబ్బుల కోసం ఉద్యమాలు చేపట్టి ఆరోగ్యశ్రీ సాధించిన ఘనత ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితమేనని కొనియాడారు. ఏబిసిడి వర్గీకరణ సాధన కోసం మాదిగలు మరో పోరాటానికి సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి నాయకులు పెద్దయ్య, మహానంది, సుంకన్న, హనుమంతు, జైపాల్, తాయన్న, బాబు, రామంజి, ఆంజినేయులు, అడివప్ప, వెంకటేష్, మల్లికార్జున, గోపి లు పాల్గొన్నారు.