విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) బీ తే.29.12.2023ది. ఏ.పి.భూ హక్కుల చట్టం 27/2023 రద్దు చేసే వరకు పోరాడతామని చోడవరం న్యాయవాదుల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాండ్రేగుల డేవిడ్ తెలియ జేశారు. ఏ.పి. భూ హక్కుల చట్టం తక్షణమే రద్దు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గడిచిన పది రోజులుగా స్థానిక కోర్టు వద్ద దీక్షలకు దిగిన న్యాయవాదులకు సీనియర్ న్యాయవాది మంథా గౌరీ శంకర్ శుక్రవారం దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాండ్రెగుల డేవిడ్ మాట్లాడుతూ రాజ్యాంగ పరమైన భూ హక్కులను కాలరాసే కొత్త చట్టాలు వలన అమాయక రైతాంగం మోసపోతారు అని తెలిపారు. సీనియర్ న్యాయవాదులు మంథా గౌరీ శంకర్, సింగ్ లు మాట్లాడుతూ భూ యజమానుల హక్కులను కాలరాసే చట్టాలు, సంస్కరణలు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. దీని కారణంగా అమాయకులైన అన్నదాతలు మోసపోతారని తెలియజేసారు. సంస్కరణల పేరుతో అన్నదాతలను మోసం చేసి, భూ ఖబ్జాలకు తెర తీసే ప్రయత్నం చేస్తే మరో ప్రజా పోరాటం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి గొర్లే కృష్ణ వేణి, జి.పి.సత్యనారాయణ, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.