సిపిఐ పార్టీ అల్లూరి జిల్లా కార్యదర్శి సత్యనారాయణ.
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- వైకాపా ప్రభుత్వం అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం దుర్మార్గమైన చర్య అని భారత కమ్యూనిస్టు పార్టీ అల్లూరి జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ అన్నారు. ఆ పార్టీ మహిళా నాయకురాలు దీసరి బీమలమ్మతో కలిసి చింతపల్లి వచ్చిన ఆయన స్థానిక మండల కార్యదర్శి పేట్ల పోతురాజు, ఎంపీటీసీ సభ్యుడు సత్తిబాబు, జిల్లా కార్యవర్గ సభ్యుడు షేక్ రెహమాన్, సీనియర్ నాయకుడు మఠం సూరి పడాల్, గోపాలరావు తదితర పార్టీ నాయకులతో అంగన్వాడీల నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడచిన 30 రోజులుగా అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై ఉద్యమం చేస్తున్నప్పటికీ సమస్యను పరిష్కరించవలసిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే గాక అంగన్వాడీలపై ఎస్మ ప్రయోగించడం ఆ ప్రభుత్వ నియంతృత్వ విధానానికి నిదర్శనమని అన్నారు. ఇటువంటి నియంతృత్వ పోకడలకు పోతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికలలో ఇంటికి సాగనంపవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.