బొల్లిముంత సాంబశివరావు
ప్రతి సంవత్సరం ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రైతాంగం విత్తనాలు సమకూర్చుకోవాల్సి ఉంది. నాణ్యమైన విత్తనాలవల్లే దిగుబడులు పెరుగుతాయి. తరచూ రైతాంగాన్ని నాణ్యమైన విత్తనాల సమస్య వెంటాడుతూ వస్తున్నది. కొన్ని విత్తన కంపెనీలు నాణ్యమైన విత్తనాల పేరుతో నకిలీ విత్తనాలు విక్రయిస్తూ రైతాంగాన్ని మోసం చేస్తున్నాయి. ఫలితంగా పంటనష్టంతో పాటు రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు. తెగుళ్ల నివారణ, అధిక దిగుబడుల పేరుతో రైతాంగాన్ని భ్రమలకు గురిచేసి విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తూ బహుళ జాతిసంస్థలు దోపిడీ చేస్తున్నాయి. పాలక ప్రభుత్వాలు విత్తనచట్టం పేరుతో కాలం గడుపుతూ కంపెనీల ప్రయోజనాలు కాపాడుతున్నాయి.
1966కి ముందు విత్తన చట్టమంటూ ఏదీలేదు. పండిన పంట నుంచి తిరిగి విత్తనం కట్టుకోవటం, లేదా పక్కచేను రైతు నుంచి విత్తనం తీసుకోవటం జరిగేది. విత్తనవ్యాపారం నామ మాత్రంగా ఉండేది. పాలకుల విధానాల వల్ల దేశంలో ఆహార సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకున్నది. సామ్రాజ్యవాదుల కనుసన్నల్లో ఉన్న ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు 1966లో కేంద్ర ప్రభుత్వం అధిక దిగుబడుల కోసం అంటూ హరిత విప్లవాన్ని ప్రకటించింది.అందుకు విదేశాల నుంచి విత్తనాలు దిగుమతి చేసుకున్నది. నకిలీ విత్తనాల విక్రయదారులపై చర్యల కోసమంటూ 1966లో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం విత్తనచట్టం చేసింది. ఈ చట్టంలోని నిబంధనలు చాలా సరళంగా ఉన్నాయి. నాసిరకం విత్తనాల సమస్య ఏర్పడినప్పుడు రైతు వ్యవసాయ అధికారికి ఫిర్యాదుచేస్తే, రాష్ట్రస్థాయి కమిటీ పరిశీలనచేసి చర్యలు తీసుకుంటుందని చట్టంలో పేర్కొన్నారు. చట్టంలోని బలహీనతలను అడ్డం పెట్టుకుని, అధికారులను లోబర్చుకుని తమ మోసాల నుంచి కంపెనీలు తప్పించుకుంటున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన సరళీకరణ, ప్రైవేటీకరణ ఆర్థిక విధానాల ఫలితంగా భారత వ్యవసాయరంగం, విత్తన రంగంపై సామ్రాజ్యవాదుల, బహుళజాతి సంస్థల పట్టు పెరిగింది. విత్తన వ్యాపారానికి బహుళజాతి సంస్థలకు భారతదేశం మంచి వనరుగా మారింది. మోన్శాంటో, డుపాయింట్, సింజెంటా వంటి సంస్థలు భారతదేశంలో 30శాతం పైగా విత్తనాలు అమ్మకం ద్వారా 2004లో 5వేల కోట్ల వ్యాపారం చేయగా, నేడు 15వేల కోట్లకు పైగా వ్యాపారం చేరుకున్నది.
నాణ్యతలేని నకిలీ విత్తనాలపై రైతాంగం ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో వారి ఆగ్రహాన్ని చల్లార్చటానికి ఆంధ్రప్రదేశ్లో కొత్త విత్తన చట్టం తెస్తున్నట్లు 2004లో రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. శాసనసభలో చట్టం ఆమోదంపొంది, దాన్ని కేంద్ర ప్రభుత్వ ఆమోదంకోసం పంపింది. ఇంతవరకు అది ఆమోదం పొందలేదు. నకిలీ విత్తనాలు, బహుళ జాతిసంస్థల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాలు తీవ్రం కావటంతో యూపీఏ ప్రభుత్వం 2004లోనే కొత్త ముసాయిదా బిల్లును పార్లమెంటులో కాకుండా రాజ్యసభలో ప్రవేశపెట్టి దాన్ని పార్లమెంటరీ స్టాండిరగ్ కమిటీకి పంపింది. యూపీఏ ప్రభుత్వం అనుసరించిన విధానం మోసకారితనం తప్ప మరొకటికాదు. ముందుగా బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టి చర్చించాలి, అలా చేయలేదు. ముసాయిదా బిల్లును పార్లమెంటరీ స్టాండిరగ్ కమిటీ అధ్యయనంచేసి అనేక సిఫార్సులతో 2006లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందచేసింది. విదేశాల నుంచి దిగుమతి అయ్యే విత్తనాలను 21రోజులపాటు క్వారంటైన్లో పెట్టి పరిశీలనలు జరిపి దేశ వాతావరణానికి సరిపోతాయని నిర్ధారించిన తర్వాతే రాష్ట్ర సంస్థలు దృవీకరణ పత్రం ఇవ్వాలన్నది స్టాండిరగ్ కమిటీ సిఫార్సుల్లో ముఖ్యమైనది. స్టాండిరగ్ కమిటీ సిఫార్సులను పక్కనపెట్టి బహుళ జాతిసంస్థల ప్రయోజనాలకు అనుగుణంగా, రైతాంగ ప్రయోజనాలను బలిపెడుతూ కొన్ని సవరణలతో 2004 ముసాయిదా బిల్లును 2006లో తిరిగి యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశ పెట్టింది.
2006 విత్తన సవరణ బిల్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను చాలా వరకు కుదించింది. బిల్లులోని సెక్షన్ 3 ప్రకారం, దేశ స్థాయిలో దిల్లీ కేంద్రంగా విత్తన కమిటీ ఏర్పడుతుంది. కమిటీ సభ్యులను కేంద్రమే నియమిస్తుంది. రాష్ట్ర స్థాయి కమిటీలకు పరిమిత అధికారాలే ఉంటాయి. వ్యవసాయ రంగం, విత్తన రంగంపైనా కేంద్రానికి అధికారాలు కల్పించటం ద్వారా రాష్ట్రాలకు ఉన్న అధికారాలు రద్దు అవుతాయి. పంటలు నష్టపోయిన రైతులకు, పంట విలువతో కూడిన నష్టపరిహారం ఇస్తారా, కేవలం విత్తన ఖరీదు ఇస్తారా అన్నది ముసాయిదాలో చెప్పలేదు. జరిమానా, జైలు శిక్షలు కూడా ముసాయిదా బిల్లులో పేర్కొన్నారు. నకిలీ సంస్థలపై తక్కువ జరిమానాను బిల్లులో పేర్కొనటంపై అనేక విమర్శల నేపథó్యంలో రెండవసారి ప్రవేశపెట్టిన ముసాయిదా బిల్లులో నకిలీ విత్తనాలపై విధించే జరిమానాను లక్ష రూపాయలు లేదా ఆరు నెలల జైలుశిక్షగా సవరణ చేశారు. పార్లమెంటరీ స్టాండిరగ్ కమిటీ 2నుంచి10లక్షల వరకు జరిమానా, ఏడాది జైలు శిక్షగా సిఫార్సు చేసింది.
విత్తనవ్యాపారం చేసే ఎవరైనా విత్తన ధృవీకరణ ఏజన్సీల ద్వారా లేదా గుర్తింపు పొందిన సంస్థల నుంచి ధృవీకరణ పొందవచ్చని ముసాయిదాలో పేర్కొనటంపై తీవ్ర విమర్శలు, వ్యతిరేకం వ్యక్తం కావటంతో రెండవసారి ప్రవేశపెట్టిన ముసాయిదాలో రాష్ట్ర సంస్థలే గుర్తింపు ఇవ్వాలని సవరించారు. 2004 విత్తన ముసాయిదా బిల్లుకు స్వల్ప సవరణలుచేసి ప్రవేశపెట్టిన ముసాయిదా బిల్లుపైనా రైతాంగంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటం, రైతు, రైతు కూలీ సంఘాలు, వ్యవసాయ నిపుణుల బిల్లు అని దుయ్యబట్టటంతో, దానికి చట్టబద్దత ఇవ్వకుండా పక్కన పెట్టడంతో 1966 చట్టమే అమలు జరుగుతూ వచ్చింది. కొత్త విత్తన చట్టంచేసి రైతాంగ ప్రయోజనాలు కాపాడాలనే నినాదం, ఆందోళనలు నిరంతరం కొనసాగుతూ ఉండగా, పార్లమెంటరీ స్థాయి సంఘం సూచనల దృష్ట్యా యూపీఏ ప్రభుత్వం విత్తన బిల్లు ముసాయిదాకు తుదిరూపం ఇచ్చేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు కోరింది. ఆచరణలో రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు తీసుకోకుండానే ఏకపక్షంగా పాత ముసాయిదాకు స్వల్ప మార్పులుచేసి 2010లో విత్తన బిల్లును రూపొందించింది. ఇందులో పొందుపరచిన నిబంధనలు కూడా విత్తన కంపెనీల ప్రయోజనాలనే పరిరక్షించేవిగా ఉన్నాయి. ఈ బిల్లుపై కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటంతో బిల్లు చట్టరూపం దాల్చలేదు.
2014లో మోదీ నాయకత్వాన ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం 2019లో విత్తన ముసాయిదా బిల్లును ప్రకటించింది. ఇది 2004 ముసాయిదా బిల్లుకు నకలు మాత్రమే. మౌలిక విధానాలన్నీ ఒకే విధంగా ఉన్నాయి. బిల్లులోని అంశాలను పరిశీలిద్దాం! నాణ్యత, విత్తన స్వచ్ఛత నూరు శాతం, మొలక 80శాతం ఉండాలని, విదేశాలనుంచి దిగుమతి చేసుకునే విత్తనాలను 21రోజులపాటు పరిశీలనలోపెట్టి, దేశ వాతావరణానికి సరిపోతాయని నిర్ధారించిన తర్వాతే ధృవీకరణ పత్రం ఇవ్వాలని 2004 విత్తన సవరణ ముసాయిదా బిల్లులో చెప్పగా, మోదీ ప్రభుత్వం 2019 ముసాయిదా బిల్లులో ఆ స్పష్టత లేదు. నకిలీ విత్తనాలపై విధించే జరిమానా, శిక్ష కూడా 2004 ముసాయిదా సవరణ బిల్లు కన్నా చాలా తక్కువగా ఉంది. 2019 విత్తన ముసాయిదా బిల్లులో నాసిరకం విత్తనంవలన రైతాంగం నష్టపోతే 1986 వినియోగదారుల చట్టం కింద అమ్మకందారుల నుంచి రైతాంగం పరిహారం పొందవచ్చని చెప్పినప్పటికీ, విత్తనంధర, దానిపై వడ్డీ చెల్లించాలా లేక ఒక పంట కాలాన్ని, తద్వారా కోల్పోయిన దిగుబడికి పరిహారం చెల్లించాలా అన్నది ముసాయిదా బిల్లులో వివరించలేదు.
యూపీఏ, ఎన్డీయే విత్తన ముసాయిదా బిల్లుల్లో ఉన్న సారాంశం ఒకటే. కొత్త సీసాలో పాత సారాయి నింపిన విధంగా ఉన్నాయి. రైతుల ప్రయోజనాలను హరించి, బహుళ జాతిసంస్థల ప్రయోజనాలు కాపాడేవిధంగా ఉన్నాయి. 2019 విత్తన ముసాయిదా బిల్లు చట్టంగా మారితే వ్యవసాయ సంక్షోభం ఊహించని ప్రమాద స్థాయికి చేరుకుంటుంది. 20 సంవత్సరాల కాలంలో సవరణల పేరుతో అనేక ముసాయిదా బిల్లులు పాలకులు ప్రవేశ పెట్టినా వాటిల్లో విత్తన కంపెనీల ప్రయోజనాలే ఉన్నాయి తప్ప రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా లేకపోవటం, పాలకుల రైతాంగ వ్యతిరేక విధానాలను వెల్లడిస్తున్నాయి. మోదీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బహుళ జాతిసంస్థల విత్తన దోపిడీని అరికట్టి నాణ్యమైన విత్తనాలు అందించాలని, దేశంలోనే విత్తన ఉత్పిత్తి జరగాలని మోదీ ప్రభుత్వంపై ఉద్యమించాలి.
సెల్: 9885983526