జిల్లా ఎస్పీ గౌతమిసాలి
విశాలాంధ్ర – అనంతపురం : బక్రీద్ పండుగను మత సామరస్యంతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ గౌతమిసాలి పిలుపునిచ్చారు.
శుక్రవారం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ లో బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం మత పెద్దలు, పోలీసు అధికారులతో ఎస్పీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ముస్లిం మత పెద్దలతో ముఖాముఖి మాట్లాడారు. ఏవైనా ఇబ్బందులుంటే తెలుసుకుని పరిష్కరించాలనే ఉద్ధేశ్యంతోనే ఈ సమావేశం నిర్వహించామని ఎస్పీ తెలిపారు.
అనంతపురం జిల్లా… మత సామరస్యానికి ప్రతీక అని, జూన్ 17వ తేదీ బక్రీద్ పండుగను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంతోషంగా జరుపుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాలలో వచ్చే వార్తలపై అప్రమత్తంగా ఉండాలని, ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే పోలీస్ అధికారులకు తెలియజేయాలన్నారు.
అనంతపురంలో ముస్లిం సోదరులు ఎక్కువగా ఉన్నారని… బక్రీదు పండుగను అన్ని మతాల వారు పరస్పరం సహకరించుకొని సోదర భావంతో పండుగను జరుపుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని భద్రతా ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.
అనంతపురంలో ఉన్న జంతు వధశాలల నందు నీటి సమస్య & పారిశుద్ధ్యం, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా మున్సిపల్, విద్యుత్ అధికారులు ఏర్పాట్లు చేసేలా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ఈసమావేశంలో అనంతపురం డీఎస్పీ టి.వి.వి ప్రతాప్, ఏ.ఆర్ డీఎస్పీ మునిరాజ, సి.ఐ లు క్రాంతికుమార్, ధరణీకిశోర్, ప్రతాప్ రెడ్డి, ఆర్ ఎస్ ఐ జాఫర్ మరియు ముస్లిం మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.