దివ్యాంగ దంపతులకు ద్విచక్ర వాహనం, బ్యాంకు రుణం అందజేసిన మంత్రి
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రజల కళ్ళల్లో కన్నీరు తుడిచి ధైర్యం నింపడానికి తాను వచ్చానని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ధర్మవరం కు చెందిన దివ్యాంగ దంపతులు నారాయణస్వామి , లక్ష్మి లకు త్రిచక్ర వాహనం గత ప్రభుత్వంలో ఇవ్వలేదని సామాజిక మాధ్యమాల్లో వీడియో ద్వారా వారు ఆవేదన చెందారు. ఈ విషయం తెలుసుకున్న సత్య కుమార్ యాదవ్ ధర్మవరం వచ్చిన వెంటనే ఆ దంపతులను కలిసి ధైర్యం నింపారు. సంస్కృతి స్వచ్ఛంద సంస్థ ద్వారా దివ్యాంగుడు నారాయణస్వామికి ద్విచక్ర వాహనం అందజేయడంతో పాటు, అతడి భార్య లక్ష్మికి బ్యాంకు ద్వారా రూ.50 వేలు ముద్ర రుణాన్ని మంజూరు చేయించారు.
ఈ సందర్భంగా దివ్యంగా దంపతులు సత్య కుమార్ ఎదుట త్రిచక్ర వాహన మంజూరు కోసం గతంలో తాము పడ్డ కష్టాలను చెప్పుకుని కన్నీరు పెట్టుకున్నారు. తాము గత ఐదు సంవత్సరాలుగా వాహనం కావాలని ప్రజా ప్రతినిధులు అధికారుల చుట్టూ ఎన్నోసార్లు తిరిగామని అయినా తమ కష్టాలు ఎవరూ వినలేదన్నారు. సత్య కుమార్ యాదవ్ తాము అడగకనే తమ సమస్యను గుర్తించి త్రిచక్ర వాహనం ఉచితంగా అందజేయడమే కాకుండా బ్యాంకు రుణం కూడా ఇప్పించడం సంతోషకరమన్నారు. ఎన్నికల్లో ధర్మవరం ప్రజలు సత్య కుమార్ యాదవ్ గారిని గెలిపించి మంచి నిర్ణయం తీసుకున్నారని, మంత్రి అయిన వెంటనే ఆయన తమ సమస్యను తీర్చారని, ఇకమీదట ధర్మవరంలో అందరి సమస్యలు తీర్చి ప్రజల కష్టాలు తీర్చుతారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్కృతి స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి, స్వచ్ఛంద సంస్థ ధర్మవరం ప్రతినిధులు సంధా రాఘవ , బాబు తదితరులు పాల్గొన్నారు.