చిన్నం కోటేశ్వరరావు
‘ఒక్కరి కోసం అందరూ అందరి కోసం ప్రతి ఒక్కరూ’ అన్న సహకార సూత్రాన్ని త్రికరణ శుద్ధిగా అమలు చేస్తూ, సామాన్యులు, చిరు వ్యాపారులు, చేతి వృత్తిదారులు, స్వయం ఉపాధిదారులతోపాటు అన్ని వర్గాల ప్రజల ఆర్థిక అవసరాలు తీర్చుతూ, ఆయా వర్గాలను ఆర్థికంగా అభివృద్ధి చేయడంతోపాటు దేశంలోని గుజరాత్, మహారాష్ట్రలోని సహకార బ్యాంక్లు మినహా అతిపెద్ద సహకార బ్యాంకుగా రూపుదిద్దుకోంది ది విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంక్ (వీసీబీ). ఈ నెల 23న 109వ సర్వజనసభ జరుపుకోనున్న ఈ బ్యాంక్ తన జీవన గమనంలో తొలిసారి 2023
24 ఆర్ధిక సంవత్సరంలో రూ.87.79 కోట్ల మిగులును (లాభం) సాధించింది. ఈ సందర్భంగా బ్యాంక్ మొండి బకాయిలను వసూలు చేయటంతోపాటు బ్యాంక్ను లాభాలబాటలో పయనింప చేస్తున్న ఉద్యోగులకు బ్యాంక్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు ఇటీవల రూ.కోటి ప్రోత్సాహక అవార్డును ప్రకటించారు. దేశంలోని 1502 సహకార బ్యాంక్లలో మొదటి పది స్థానాలలో ఉండటమే కాకుండా విశాఖపట్నం బ్యాంక్కు ఒక ప్రత్యేకత ఉంది.
సామాన్యుల ఆర్థిక అవసరాలు తీర్చాలన్న ఆశయంతో శ్రీపతి భద్రయ్య పంతులు, బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి, భమిడిపాటి తమ్మయ్య శాస్త్రి, మద్ది పట్టాభి రామిరెడ్డి, వేపా కామేశం తదితరులు కేవలం రూ.2,512 మూలధనంతో విశాఖ పట్నం కేంద్రంగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు కార్యకలాపాలు ఆరంభిం చారు, అనేక ఆటుపోట్ల నడుమ 1983 నాటికి 2,873 మంది సభ్యులతో రూ.కోటి ఆర్థిక కార్యకలాపాలతో సొంత భవనంలోకి చేరింది. అదే ఏడాది బ్యాంకు పాలకవర్గం ఎన్నికల్లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కార్మికోద్యమనేత మానం ఆంజనేయులు సిబ్బంది సహకారం, సభ్యుల నమ్మకంతో బ్యాంకు బలోపేతానికి బాటలు వేశారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు, చిరువ్యాపారు లకు ఆర్థిక చేయూతనిస్తూ సభ్యుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు అమలు ద్వారా కార్యకలాపాలను విస్తృతం చేస్తూ ప్రజల నమ్మకాన్ని చూరగొన్నారు. 2013లో ఆంజనేయులు బ్యాంకు అధ్యక్ష బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకునే నాటికి 28 శాఖలను ఏర్పాటు చేయగా, సభ్యుల సంఖ్య 47,790కి చేరింది. రూ.92 కోట్ల మూలధనం, రూ.1,905 కోట్ల డిపాజిట్లు, రూ.1,264 కోట్ల రుణాలు, రూ.89 కోట్ల రిజర్వుతో ఉంది. మానం ఆంజనేయులు మార్గదర్శకంలో కార్మికోద్యమ నేత, కమ్యూనిస్టు పార్టీ నాయకులు చలసాని రాఘవేంద్రరావు 2013 అక్టోబరు 10న బ్యాంక్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు.
రూ.7,348 కోట్ల ఆర్థిక లావాదేవీలు
ఈ ఏడాది మార్చి నాటికి రెండు తెలుగు రాష్ట్రాలలో 50 బ్రాంచ్లకు బ్యాంక్ సేవలు విస్తరించాయి. ఇటీవలే విశాఖ నగరం షీలానగర్లో కొత్త బ్రాంచ్ ప్రారంభించగా, త్వరలో తాడేపల్లిగూడెం, నరసరావుపేట, బాపట్ల, చిత్తూరులోనూ బ్రాంచ్లను ప్రారంభించి ఆయా ప్రాంత ప్రజలకు బ్యాంక్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం రూ.7,348 కోట్ల ఆర్థిక కార్యకలాపాలతో ఉన్న బ్యాంక్లో రూ.4,148.50 కోట్ల డిపాజిట్లుండగా, రూ.3,199.50 కోట్ల రుణాలను బట్వాడా చేసింది. ఔట్ లుక్ ఆన్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్’ పేరుతో ఆర్బీఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం రూ 352.61 కోట్ల మూలధనంతో దేశంలోని మొత్తం సహకార బ్యాంకుల్లో నాల్గవ స్థానంలో నిలిచి జాతీయ స్థాయి గుర్తింపు సాధించింది. 1,04,865 మంది సభ్యులతో 14 సొంత భవనాల్లో సేవలు కొనసాగిస్తున్న బ్యాంకుకు రిజర్వ్ నిధులు రూ.431.30 కోట్లకు చేరాయి. వాణిజ్య బ్యాంక్లకు ధీటుగా అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను ఖాతాదారులకు అందించడటంతో వీసీబీ అగ్రస్థానంలో ఉంది.
నూతన ఒరవడికి మార్గదర్శి
బ్యాంక్ సభ్యులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, సహకార రంగంలో సరికొత్త ఒరవడి సృష్టిస్తోన్న వీసీబీ సహకారవేత్తలను ఆలోచింపజేస్తోంది. గత 40 ఏళ్లగా సభ్యులకు క్రమం తప్పకుండా డివిడెండు చెల్లిస్తోంది. బ్రాంచి స్థాయిలో ఏటా జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించడంతోపాటు సభ్యులకు సమగ్ర సమాచారంతో కూడిన నివేదికలు అందజేస్తోంది. దేశంలో ఏ సహకార బ్యాంకులో లేని విధంగా బ్రాంచ్ స్థాయిలో సంప్రదింపుల కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోని 46 సహకార బ్యాంకుల్లో ఎక్కడా లేని విధంగా ఏటా వచ్చే మిగులు అందరికీ సమానంగా దక్కాలన్న ఆలోచనతో ఒక్కో సభ్యునికి షేర్ క్యాపిటల్ మొత్తం రూ.2 లక్షల వరకు మాత్రమే సీలింగ్ పెట్టిన తీరు ఆదర్శనీయం. ఆస్తి తనఖాపై రుణం తీసుకున్న వ్యక్తి సక్రమంగా వాయిదాలను తిరిగి చెల్లిస్తే తాను కట్టిన వడ్డీ మొత్తంలో నాలుగు శాతం తిరిగి సభ్యునికి ప్రోత్సాహకంగా అందిస్తోంది విశాఖ బ్యాంకు. దేశంలోనే ఏ సహకార సంస్థగానీ, బ్యాంకులుగానీ ఈ విధమైన ప్రోత్సాహకం అందిస్తున్నది మరొకటి లేదు. దేశంలో మరేఇతర సహకార బ్యాంక్ అమలు చేయని రీతిలో విద్యార్థులకు నగదు బహుమతులను కూడా అందిస్తోంది.
సహకార ఉద్యమానికి ఊపిరి
సహకార వ్యవస్థ బలోపేతం కోసం వీసీబీ పాలకవర్గం తీసుకుంటున్న సమష్టి, దూరదృష్టి నిర్ణయాలు సహకార స్ఫూర్తికి నిదర్శనం. సహకార వ్యవస్థలో వస్తున్న మార్పులు ఆర్బీఐ ఆదేశాలు, దేశంలో ఆర్థిక పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ మానం ఆంజనేయులు, చలసాని రాఘవేంద్రరావు నేతృత్వంలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకును ముందుకు నడపడంతోపాటు తెలుగు రాష్ట్రాలోని సహకార అర్బన్ బ్యాంకులు, క్రిడెట్ సొసైటీలకు ఇస్తున్న తోడ్పాటు సహకార విలువులకు అద్దం పడుతున్నాయి. ఇటీవల జరిగిన నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అండ్ అండ్ క్రెడిట్ సొసైటీస్(నాఫ్కాబ్) ఎన్నికల్లో దేశంలోని అర్బన్ బ్యాంకులు, సొసైటీల ప్రతినిధులు రాఘవేంద్రరావును డైరెక్టర్గా ఎన్నుకోవడం సహకార వ్యవస్థ బలోపేతానికి బాటలు వేయడంలో వీసీబీ పాత్ర మరింత పెరిగింది.
ఐక్యరాజ్య సమితి 2025 సంవత్సరాన్ని ‘‘రెండవ అంతర్జాతీయ సహకార సంవత్సరం’గా నిర్వహించాలని సభ్యదేశాలకు పిలుపునిచ్చింది. 2012లో మొదటి అంతర్జాతీయ సహకార సంవత్సరం సాధించిన విజయాల స్ఫూర్తితో, యూఎన్ఓ రెండోసారి అంతర్జాతీయ సంవత్సరం నిర్వహించాలని పిలుపునివ్వ డం సహకార సంస్థల ప్రాధాన్యతను చాటిచెబుతోంది. సహకార వ్యవస్థల ద్వారా ఐక్యరాజ్య సమితి ఆశిస్తున్న గౌరవప్రదమైన ఉపాధి, ఉద్యోగ కల్పన, పేదరికం, ఆకలి నిర్మూలన, విద్య, అన్ని రకాల ఆరోగ్య సంరక్షణలతో కూడిన సామాజిక భద్రత, ఆర్థిక భాగస్వామ్యం, అన్ని వర్గాల వారికి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అందుబాటులో గృహ సదుపాయం వంటి లక్ష్యాల సాధనకు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు ప్రత్యేక చర్యలు చేపట్టనుందని బ్యాంకు చైర్మన్ రాఘవేంద్రరావు తెలిపారు. బ్యాంక్ పురోభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేయాలనే సదుద్దేశంతో రుణగ్రహీతలే కాకుండా, డిపాజిట్దారులకు కూడా సభ్యత్వం కల్పించిన ఏకైక సహకార బ్యాంక్ ది విశాఖపట్నం బ్యాంక్.
` డైరెక్టర్, విశాఖ కోఆపరేటీవ్ బ్యాంకు