విశాలాంధ్ర -అనంతపురం : జిల్లా ఎస్పీ గౌతమిసాలి ఆదేశాల మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేఖ దినోత్సవం పురస్కరించుకుని ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచిస్తూ కళాశాలలు/పాఠశాలల విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించారు. అనంతరం ప్రధాన కూడళ్లలో మానవహారాలు చేపట్టి మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన చేశారు. అంతేకాకుండా… కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులతో సమావేశమై ప్రధానంగా యువత, విద్యార్థులు మేల్కొని ప్రజలు మత్తు పదార్థాలతో జీవితాలు బుగ్గి పాలు చేసుకోకుండా చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. గంజాయి, తదితర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాల జోలికెళితే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారో పూసగుచ్చినట్లు వివరించారు.