మన పార్లమెంటరీ కార్యకలాపాలు ఇటీవల చాలా సందర్భాలలో రణరంగంగానే కనిపిస్తున్నాయి. ఉభయ పక్షాల వారు సకల విధ యుద్ధ తంత్రాలనూ ప్రయోగించి జరగవలసిన కార్యక్రమాలు జరగకుండా అడ్డు పడగల నైపుణ్యం సంపాదించారు. పోటా పోటీలు, ఎత్తులు పై ఎత్తులు ఉన్నప్పుడు ఏ పక్షం వారికైనా నోరు సంపూర్ణంగా అదుపులో ఉండడం కష్టమే. అందుకే పార్లమెంటులో ఏ సభ్యుడి నోటి నుంచైనా ఉచ్చరించకూడని మాట వెలువడితే దాన్ని పార్లమెంటరీ సంప్రదాయం కాదంటాం. పార్లమెంటరీ మర్యాదలకు విరుద్ధమైన మాటలను కొన్నింటిని కూర్చి ఆ మధ్యలో ఒక జాబితా కూడా విడుదల చేశారు. సభ్యులు ఈ మాటలను తమ ప్రసంగాల సమయంలో నివారించాలన్నది అసలు ఉద్దేశం. ఈ జాబితా మర్యాద పూర్వకమైన భాషకే పరిమితం అయింది. నిఘంటువుల ప్రకారం అపశబ్దం అంటే లక్షణ, వ్యాకరణ విరుద్ధమైన పదాలు అని శబ్దరత్నాకరం వివరిస్తోంది. శిష్ట వ్యవహారంలోలేని పదాలను సైతం శబ్ద రత్నాకరం అపశబ్దాల జాబితాలోకి తోసేసింది. సంగీత పరిభాషలో చెప్పాలంటే ఇలాంటి మాటలను అపస్వరాలు అంటారు. దీనికి విరుద్ధంగా ఉండేవి సంగీతంలో అయితే సుస్వరాలు. పార్లమెంటు అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల సభ కనక వారు మర్యాదగా మెలగుతారన్న నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం గుడ్డిదని అనేక సందర్భాలలో రుజువు అవుతూనే ఉంటుంది. అందుకే పార్లమెంటులో వాడకూడని మాటల జాబితా రూపొందించారు. అయితే ఇది మర్యాదకు మాత్రమే సంబంధించింది. దశాబ్దాల తరబడి మన విధానంలో భాగమైన కొన్ని అంశాలను పార్లమెంటు వేదిక మీంచి ప్రయోగించడం సభా మర్యాదను ధిక్కరించడమేనని, పార్లమెంటరీ పరిభాష పరుధుల్ని ఉల్లంఘించడమేనని 18వ లోకసభ తొలిరోజు సమావేశంలో రుజువైపోయింది. అయిదుసార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికైన మజ్లిస్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ లోక్సభ సభ్యుడిగా ప్రమాణం స్వీకరించిన తరవాత జై భీం, జై తెలంగాణ, జై పలస్తీనా అన్నారు. ఇందులో జై పలస్తీనా అన్న నినాదం చాలా మందికి, ముఖ్యంగా ముస్లింల పేరెత్తితేనే శివాలూగిపోయే బీజేపీ సభ్యులకు అది పార్లమెంటరీ మర్యాదకు భంగం కలిగించే అపశబ్దంగా వినిపించింది. అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణం స్వీకరించి, ఈ నినాదాలు చేసేటప్పుడు ప్రోటెం స్పీకర్కు సహాయకుడిగా నియుక్తుడైన రాధా మోహన్ సింగ్ సభాధ్యక్షుడి స్థానంలో ఉన్నారు. ఒవైసీ నినాదాలపై గొడవ మొదలవగానే ప్రోటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ తన స్థానంలోకి వచ్చారు. ఒకవేళ ఒవైసీ నినాదాలు వివాదాస్పదమైనవి అయితే వాటిని సభ రికార్డుల నుంచి తొలగిస్తామని రాధామోహన్ సింగ్ హామీ ఇచ్చేశారు. మహతాబ్ తన స్థానంలోకి రాగానే సభ్యులు కేవలం ప్రమాణం మాత్రమే స్వీకరించాలని, అది మాత్రమే రికార్డులలోకి వెళ్తుందని స్పష్టం చేశారు. ఆయన చెప్పిన మాటలో తప్పులేదు. సాధారణంగా సభ్యులు ఎప్పుడైనా నోరు జారితే, లేదా ఉద్దేశ పూర్వకంగానే సభా నిబంధనలకు విరుద్ధమైన మాటలు మాట్లాడితే సభాపతి రికార్డులను పరిశీలించి రికార్డులలోంచి తొలగించవలసిన మాటలను తీసేస్తుంటారు. ఈ మధ్య కాలంలో మాటల్నే కాదు, వాక్యాలనే కాదు, పేరాలకు పేరాలే రికార్డుల నుంచి తొలగించాలని ప్రభుత్వానికి అత్యంత విధేయులుగా మెలిగే ఓం బిర్లా లాంటి వారు ఆదేశిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ ఆయనే స్పీకర్ గా ఎన్నికయ్యారు. ఇలాంటి దోష ప్రకరణాల జాబితా అంటే ప్రతిపక్షాలు మాట్లాడిన అంశాలను రికార్డుల్లోకి ఎక్కకుండా గట్టిగా కాపలా కాసే బాధ్యతను ఓం బిర్లా తీసుకుంటారన్న ‘‘భరోసా’’తో ఉండవచ్చు.
అసదుద్దీన్ ఒవైసీ ‘‘జై పలస్తీనా’’ అనడం ఇంతవరకు మనం అనుసరించిన విదేశాంగ విధానానికి ఏ రకంగా విఘాతం కలిగిస్తుందో సభాధ్యక్ష స్థానంలో ఉన్న రాధా మోహన్ సింగ్ కానీ, ముస్లింల విషయంలో నిత్య జాగరూకంగా ఉండే కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కానీ చెప్పనే లేదు. కానీ ‘‘ఒవైసీ నినాదం ముమ్మాటికీ తప్పే’’ అని తేల్చేశారు. కిషన్ రెడ్డి లాంటి వారి దృష్టి మాత్రమే పాక్షికమైంది కాదు. వారూ సకల విషయాలను హిందూ-ముస్లిం కళ్లద్దాలలోంచి చూడగలరు. ఒవైసీ ‘‘జై పలస్తీనా’’ అని నినదించడంలో తప్పేమిటో తెలియదు. దశాబ్దాల కిందటి నుంచి పలస్తీనా పోరాటానికి మద్దతు ఇవ్వడం, తీవ్రవాద రాజ్యంగా వ్యవహరించే ఇజ్రాయిల్ను ఎదిరించడం మన విదేశాంగ విధానంలో భాగం. ఈ విధానాన్ని మోదీ అధికారంలోకి వచ్చాక అధికారికంగా మార్చలేదు కానీ ఆచరణలో మార్చారు. అందుకే ‘‘పలస్తీనా’’ మాట వింటేనే కిషన్ రెడ్డి మొదలైన వారికి ఒంటి నిండా తేళ్లు జెర్రులు పాకుతాయి. వారి కర్ణేంద్రియాలకు పాక్షిక వినికిడి శక్తి మాత్రమే ఉన్నట్టుంది. జై పలస్తీనా అనడం నిబంధనలకు విరుద్ధమట. ఈ దేశంలో ఉంటూ భారత్ మాతాకి జై అనడానికి నిరాకరించే వారు జై పలస్తీనా అంటున్నారని కిషన్ రెడ్డి తెగ బాధపడి పోయారు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని కూడా తేల్చేశారు. అధికార పక్షానికి నచ్చనిదల్లా జరూరుగా రాజ్యాంగ విరుద్ధం అయిపోయేంత వేగంగా అభివృద్ధి రథ చక్రాలు తిరుగుతున్నాయి. జి. కిషన్ రెడ్డి నోటితోనే ఒవైసీని విమర్శించారు. కానీ బరేలీ నుంచి ఎన్నికైన బీజేపీ సభ్యుడు ఛత్రపాల్ సింగ్ ఒవైసీకి సమాధానం చెప్పారు. ఆయన ప్రమాణ స్వీకరించిన తరవాత ‘‘జై హిందు రాష్ట్ర’’ అన్నారు. ఇక్కడే తేడా గమనించాలి. దశాబ్దాలుగా మనం అనుసరిస్తున్న విదేశాంగ విధానానికి అనుగుణంగా నెత్తురోడుతున్న పలస్తీనియన్ల అనంత విషాద గాథకు ఒవైసీ నినాద రూపం ఇస్తే ఛత్రపాల్ సింగ్ ‘‘జై హిందు రాష్ట్ర’’ అనడం ద్వారా బీజేపీ రహస్య ఎజెండాను మరోసారి బట్టబయలు చేశారు. ప్రమాణం స్వీకరించిన తరవాత ఏదో ఓ నినాదం చేయడం ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయింది. జై హిందు రాష్ట్ర అని నినదించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్ష ‘‘ఇండియా’’ ఐక్య సంఘటన సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అఖిలేశ్ యాదవ్ ఇది రాజ్యాంగ విలువలకు విరుద్ధం అని గుర్తు చేశారు. కానీ ఘనత వహించిన బీజేపీ సభ్యుల దృష్టిలో మన సుదీర్ఘ విదేశాంగ విధానంలో భాగమైన పలస్తీనా పేరెత్తడమే అపశబ్దంగా తయారైంది. బీజేపీ ఎంపీలు చిత్ర విచిత్రమైన నినాదాలు చేశారు. గజియాబాద్ నుంచి ఎన్నికైన అతుల్ గర్గ్ ఏకంగా ‘‘ నరేంద్ర మోదీ జిందాబాద్’’ అన్నప్పుడు ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేస్తే ఆయన వీరోచితంగా మళ్లీ వేదిక మీదకు వచ్చి ‘‘డా. హెడ్గెవార్ జిందాబాద్’’ అని కూడా నినదించి అధికార పక్ష ధోరణిని అనుమానానికి అవకాశం లేకుండా వ్యక్తం చేశారు. అనేక మంది తెలుగు దేశం నాయకులు జై తెలుగు దేశం, తెలంగాణ నాయకులు జై తెలంగాణ అనడం ఎవరికీ అభ్యంతరకరం కాలేదు. రాహుల్ తో సహా కొంత మంది రాజ్యాంగ ప్రతిని చేతబూని ప్రమాణం చేశారు. సర్వ జనామోదిత పలస్తీనాకు మద్దతు తెలపడం మోదీ ఏలుబడిలో అపశబ్దం అయిపోయింది. హిందూ రాష్ట్ర సుస్వరం అయిపోయింది. ఇదీ మన ప్రస్థానంలోని వైపరీత్యం.