చలసాని వెంకటరామారావు
హోచిమిన్ పేరు వింటేనే ఇండోచైనా దేశాలలో సుదీర్ఘ విప్లవోద్యమం, గెరిల్లా పోరాటం స్ఫురణకు వస్తుంది. 30 ఏళ్ల వియత్నాం ప్రజలు వీరోచిత పోరాటం, త్యాగం గుర్తుకు వస్తుంది. హోచిమిన్ వియత్నాం కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక నాయకులు. 1890 మే 19 న మధ్య వియత్నాంలోని ‘‘కింలీన్’’ అనే గ్రామంలో జన్మించారు. ఫ్రెంచి వారి వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన వియత్నాంప్రజల పోరాటానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించారు. ఇండోచైనాలో భాగంగా ఫ్రెంచి వారి వలస ప్రాంతంగా వియత్నాం ఉండేది. ఈయన అసలు పేరు గుయెన్ టాట్ ధన్. ‘బా’ అనే పేరుతో 1911 లో ఒక ఫ్రెంచ్ స్టీమర్లో వంటపని సహాయకునిగా చేరి లండన్, ఫ్రాన్స్లలో పనిచేశాడు. తోటమాలి, స్వీపరు, వెయిటరు, ఫోటోరీటుచరు, ఓపెన్ స్టోకర్గా పనిచేశాడు. ఫ్రాన్స్లో సోషలిస్టుగా మారిన ఈయన అనేక మారుపేర్లతో వివిధ దేశాలలో సంచరించారు. సుమారు 50 కి పైగా మారుపేర్లు ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో పెట్టుకున్న మారుపేరు హోచిమిన్ అసలు పేరుగా స్ధిరపడిపోయింది.
మొదటి ప్రపంచ యుద్ధం తరువాత హోచిమిన్ ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో భాగం పంచుకున్నారు. తరువాత కమ్యూనిజం సిద్ధాంత అధ్యయనం కోసం మాస్కో వెళ్లారు. 1924 లో చైనా వెళ్లి తన దేశీయులతో కలిసి విప్లవోద్యమ నిర్మాణం ప్రారంభించారు. 1924 జూన్ 17 నుండి జులై 8 వరకు కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ 5 వ మహాసభలో చురుకైన పాత్ర వహించారు. 1924 డిసెంబరులో ‘వైథుయ్’ పేరుతో హోచిమిన్ కాంటన్కు వెళ్లి వియత్నాం జాతీయవాద ఉద్యమాన్ని ప్రారంభించాడు. వియత్నాం దేశం అన్ని ప్రాంతాలలో సుశిక్షితులైన కార్యకర్తలను ఎంపిక చేసి కార్యాచరణను ప్రారంభించారు. 1927 లో చైనా కమాండరుగా ఉన్న చియాంగ్ కై షేక్ చైనా కమ్యూనిస్టులను కాంటన్ నుంచి బహిష్కరించారు. దానితో మళ్లీ సోవియట్ రష్యాలో ఆశ్రయం పొందవలసి వచ్చింది. సోవియట్ నుంచి 1928 లో బ్రస్సెల్స్, ప్యారిస్ వెళ్లి అక్కడి నుంచి సియామ్ (థాయ్లాండ్) వెళ్లి అక్కడ ఆగ్నేయ ఆసియాలోని కమ్యూనిస్టు పార్టీల తరపున కమ్యూనిస్టు పార్టీల ప్రపంచ సంస్థ కమ్యూనిస్టు ఇంటర్ నేషనల్ ప్రతినిధిగా 2 సంవత్సరాల పాటు ఉన్నారు. 1929 మే లో హాంకాంగ్లో జరిగిన ఒక సమావేశంలో ఇండోచైనీస్ కమ్యూనిస్టు పార్టీ (పి.సి.ఐ) ఏర్పాటు చేయాలని నిర్ణయించి మొదటిగా వియత్నాం కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు. సోవియట్ యూనియన్ సలహా మేరకు దానినే ఇండో చైనాస్ కమ్యూనిస్టు పార్టీ అని పేరు మార్చారు. పి.సి.ఐ. ఏర్పాటు వియత్నాంలో మంచి ప్రభావాన్ని కలిగించింది. 1931 జూన్లో కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ ప్రతినిధిగా హాంకాంగ్లో ఉండగా పోలీసులు అరెస్టుచేసి 1933 వరకు జైలులో ఉంచారు. జైలులో ఉండగా క్షయ వ్యాధికి గురై తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. జైలునుంచి విడుదలైన తరువాత సోవియట్ రష్యా వెళ్లి 1935 లో మాస్కోలో జరిగిన ఇంటర్నేషనల్ 7 వ మహాసభలో పి.సి.ఐ. తరపున ముఖ్య డెలిగేట్గా పాల్గొన్నారు. క్షయవ్యాధికి చికిత్స పొందారు.
అనంతరం 1938 లో తిరిగి చైనా వెళ్లి మావో సే టుంగ్తో పాటు కొన్ని నెలలు ఉన్నారు. 1941లో జపాను దేశం వియత్నాంను ఆక్రమించింది. అప్పుడు హోచిమిన్ వియత్నాంలో ‘వియెత్ మిన్’ అనే గెరిల్లా సైన్యాన్ని నిర్మించి జపాన్ సైన్యంతో గెరిల్లా పద్దతిలో పోరాటం నిర్వహించారు. ఈ కాలంలోనే చియాంగ్ కై షేక్ ప్రభుత్వం హోచిమిన్ను అరెస్టుచేసి 18 మాసాలు చైనాలో ఖైదు చేసింది. జైలులో ‘కీర్తి, నోట్బుక్ ఫ్రం ప్రిజన్’ అనే పుస్తకాలు రచించారు. 1945 రెండవ ప్రపంచ యుద్ధంలో జపాను వారు ఇండోచైనాను ఆక్రమించి ఫ్రెంచి అధికారులందరిని అరెస్టు చేశారు లేదా ఉరితీశారు. 6 నెలల అనంతరం అమెరికా జపాన్లోని హిరోషిమాపై అణుబాంబును ప్రయోగించింది. దానితో జపాన్ పూర్తిగా ఓడిపోయింది. దీనితో హోచిమిన్ ప్రత్యర్థులుగా ఉన్న జపాన్, ఫ్రాన్స్లు రెండు అడ్డు లేకుండాపోయాయి. ఈ సమయంలోనే దక్షిణ చైనా పర్వతాలలో జపనీయులకు వ్యతిరేకంగా హోచిమిన్ పోరాటం చేశారు. 1945 వసంత కాలంలో తన కమాండోస్తో సహా హనోయ్ వెళ్లి తమ పోరాట గెరిల్లా సంస్థ లియత్మిన్ నాయకత్వంలో అధికారాన్ని హోచిమిన్ స్వాధీనం చేసుకున్నారు. వియత్నాం దేశాన్ని ‘డెమాక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం’ గా ప్రకటించారు.
ఫ్రెంచ్వారు తమ వలసలను వదిలి వేయటం ఇష్టం లేకపోవటంతో 1946 చివరలో ఇరు సేనల మధ్య 8 సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది. 1954 వరకు హోచిమిన్ గెరిల్లా పోరాటం జరిపి ‘దిన్ బిన్ ఫూ’ యుద్ధంలో ఫ్రెంచి వారిని ఓడిరచి వియత్నాం స్వతంత్రం ప్ర్రకటించారు. 1954 మే 8 న జెనీవాలో కంబోడియా, చైనా, ఫ్రాన్స్, లావోస్, బ్రిటన్, అమెరికా, సోవియట్ యూనియన్, ఉత్తర వియత్నాం, దక్షిణ విత్నాంలతో ఒక కాన్ఫరెన్సు జరిగింది. దీనిలో సుదీర్ఘ చర్చల అనంతరం ఒక ఒప్పందం జరిగింది. వియత్నాం దేశాన్ని ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాంలుగా రెండు దేశాలుగా విభజించాలని నిర్ణయించారు. 300రోజుల్లో యుద్ధదళాలను ఫ్రెంచి వారు ఉపసంహరించారు. 1955 లో లావోస్, కంబోడియాలలో స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు నిర్వహించాలి. ఈ ఒప్పందం అమలును భారతదేశం, పోలెండ్, కెనడా ప్రతినిధుల కమిషన్ పర్యవేక్షించాలి. ఈ మేరకు వియత్నాం ఉత్తర ప్రాంతాన్ని దియెత్మిన్ విప్లవోద్యమకారులకు అప్పగించటం జరిగింది. ఉత్తర వియత్నాంలో సామ్యవాద సమాజ నిర్మాణానికి హోచిమిన్ పూనుకున్నారు. కానీ అమెరికా దుష్ట పన్నాగంతో దక్షిణ వియత్నాంలో కమ్యూనిస్టు వ్యతిరేక రాజ్య నిర్మాణం లక్ష్యంగా 1956 ఐక్య ఎన్నికలను తిరస్కరించింది. దానితో వియత్నాం ఏకీకరణ ఆశయంతో యుద్ధం ప్రారంభమైంది. 1954 నుండి 1975 వరకు దీర్ఘకాలం 30 ఏళ్లపాటు యుద్ధం కొనసాగింది. దీనినే రెండో ఇండో చైనా యుద్ధం అనికూడా పిలుస్తారు. 1960 దశకంలో దక్షిణ వియత్నాం పాలకులకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటాన్ని వియత్నాం ఏకీకరణ లక్ష్యంగా హోచిమిన్ ఉత్తర వియత్నాంలో ప్రారంభించారు. ఇదే వియత్నాం యుద్ధంగా ప్రసిద్ధి చెందింది. దక్షిణ వియత్నాం విముక్తికై అమెరికా సైన్యాలతో పోరాటం జరిగింది.
1969 సెప్టెంబరు 3న ఆరోగ్యం క్షీణించటంతో హోచిమిన్ మరణించారు. అనంతరం కూడా దక్షిణ వియత్నాం గెరిల్లా పోరాటం కొనసాగింది. హోచిమిన్ మరణించిన 6 ఏళ్లకు 1975 లో దక్షిణ వియత్నాం కమ్యూనిస్టులవశం కావటంతో వియత్నాం ఏకీకరణ పూర్తయి యుద్ధం ముగిసింది.30 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ఎంతో విధ్వంసం సృష్టించి, లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న ఈ యుద్ధాన్ని అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రేరేపించింది. వియత్నాంలో దీనిని ‘అమెరికా యుద్ధం’ అని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో 1969 నాటికి 5 లక్షల అమెరికా సైన్యాలు ప్రత్యక్షంగా పాల్గొన్నాయి. దేశం మొత్తం ఒక పాలన కింద ఐక్యంగా ఉండాలని కమ్యూనిస్టులు పోరాడితే, అమెరికా మద్ధతుతో దక్షిణ వియత్నాం పశ్చిమదేశాల సాయంతో మారణహోమాన్ని సృష్టించింది. సోవియట్ రష్యా, చైనాల సాయంతో కమ్యూనిస్టుల గెరిల్లా పోరాటయోధులు తెగించి ఈ యుద్ధంలో పాల్గొన్నారు. అమెరికాకు దీటుగా ఆయుధాలు, యుద్ధ సామగ్రి, సలహాదారులను సోవియట్, చైనాలు అందించాయి. ఈ వియత్నాం యుద్ధంలో చనిపోయినవారిసంఖ్య అపారంగా ఉంది. రెండువైపుల అపార నష్టం జరిగింది. రెండు మిలియన్ల మంది పౌరులు ఈ యుద్ధంలో చనిపోయారు. 1.1 మిలియన్ల ఉత్తర వియత్నాం యోధులు, రెండు లక్షల అమెరికా సైన్యాలు, రెండున్నర లక్షల దక్షిణ వియత్నాం ప్రభుత్వ సైనికులు ఈ యుద్ధంలో మరణించారు. వియత్నాం యుద్ధం వల్ల ఆగ్నేయ ఆసియా ఒక శక్తిమంతమైన సైనిక శక్తిగా ఉద్భవించింది. కానీ వ్యవసాయం, వ్యాపారం, పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గ్రామీణ ప్రాంతాలు బాంబుల విధ్వంసంతో, ల్యాండ్ మైన్లతో కప్పబడి పట్టణాలు, నగరాలు తీవ్ర విధ్వంసానికి గురయ్యాయి. వియత్నాంలో కమ్యూనిజం నిలబడితే అది మొత్తం ఆగ్నేయ ఆసియా అంతటా విస్తరిస్తుందని, పెట్టుబడిదారీ విధానాన్ని కూల్చివేస్తుందని అమెరికా భయపడిరది. అందుకే ఇంతటి తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. ఆ కాలంలో అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన జాన్ ఎఫ్ కెన్నడీ, లిండన్ బి.జాన్సన్లు దక్షిణ వియత్నాంకు సైనిక సహాయం అందించారు. ఉత్తరవియత్నాంపై అమెరికా అపారంగా బాంబులను ప్రయోగించింది. ఆధునిక యుద్ధ ఆయుధాలను ప్రయోగించింది. చివరకు వియత్నాం విద్యార్థులు సైతం ఒక చేతితో పుస్తకాల సంచి, మరో చేతితో తుపాకీ పట్టుకుని యుద్ధంలో పాల్గొన్నారు. చివరకు అమెరికా విధానంపట్ల ఆ దేశంలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికా పౌరులు వీధులలోకి వచ్చి నిరసన తెలిపారు. ప్రపంచవ్యాపితంగా అమెరికా పట్ల నిరసన వ్యక్తమయ్యింది. ఈ దశలో గత్యంతరం లేని పరిస్థితులలో వియత్నాం నుంచి 1973 లో అమెరికన్ సైన్యాల ఉపసంహరణ ప్రారంభమైంది. చివరకు 1976 జులై 2 న వియత్నాం దేశం ఒక్కటిగా ‘‘సోషలిస్టు రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం’’ గా ఏకమైంది. సైగాన్ సిటీ పేరును హోచిమిన్ సిటీగా పేరుమార్చి రాజధానిగా ప్రకటించటం జరిగింది. దీనితో 30 ఏళ్ల పోరాటం ముగిసింది. ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ గొప్ప నాయకునిగా, ఆగ్నేయ ఆసియాలో గుర్తింపును పొందారు. వియత్నాం ఏకీకరణ జరిగిన 48 వ వార్షికోత్సవం (జూలై 2) సందర్భంగా హోచిమిన్కు విప్లవ జోహార్లు.
కమ్యూనిజం ఎడిటర్,
సెల్: 9490952093