విశాలాంధ్ర – పరవాడ (అనకాపల్లి); వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలను జీవీఎంసీ పరిధి 79వ వార్డు లంకెలపాలెం కూడలిలో గురువారం ఘనంగా నిర్వహించారు. పరవాడ తూర్పు కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు మడక రమేష్ నాయుడు తదితరులు రంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ కులాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తూ అసువులు బాసిన వంగవీటి మోహనరంగాను ఇప్పటికీ ప్రజలు మరిచిపోలేదన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది ఏదో ఒక చోట ఆయన విగ్రహాలు ఆవిష్కరణ చేస్తూనే ఉన్నారన్నారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్న వంగవీటి మోహన రంగా చిరస్మరణీయులని అన్నారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు కె. వాసుదేవరావు, బిజెపి నాయకుడు బంతికోరు గోవిందరాజు,రాఘవా పురపు శ్రీనివాస్ కుమార్, గొల్లవిల్లి నానాజీ, సంపంగి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.