‘మామూలు’ గా తీసుకుంటున్న ప్లానింగ్ అధికారులు
విశాలాంధ్ర – పరవాడ (అనకాపల్లి జిల్లా); జీవీఎంసీ 79వ వార్డు పరిధి దేశపాత్రునిపాలెంలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. గొల్లపేట, సాయినగర్ కాలనీ, జాజులవానిపాలెం ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా వెలుస్తున్నాయి. వీటిపై పిర్యాదులు ఉన్నప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు మామూలు గా తీసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ నిర్మాణాల వైపు కన్నెత్తి చూడకపోవడంతో టౌన్ ప్లానింగ్ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క కొన్ని చోట్ల అనుమతులు ఉన్నాయని చెబుతున్న భవన నిర్మాణాల్లో కూడా తీసుకున్న అనుమతులకు చేపడుతున్న నిర్మాణాలకు ఎలాంటి పొంతన లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. అసలు ఈ ప్రాంతంలో పట్టణ ప్రణాళిక విభాగం పనిచేస్తోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడ బడితే అక్కడ అనుమతులు లేని నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నప్పటికీ అధికారులు ఏలాంటి చర్యలు తీసుకోకపోవటం లేదని పలువురు విమర్శిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది చేతి వాటంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల హస్తం ఉందనే ఆరొపణలు లేకపోలేదు. నిర్మాణదారు లిచ్చే తాయిలాలకు అలవాటు పడి పరోక్షంగా అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, దేశపాత్రునిపాలెంలో చేపడుతున్న అక్రమ కట్టడాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.