ఇమ్రాన్ ఖాన్ హెచ్చరిక
సీజేపై నమ్మకం లేదన్న పీటీఐ అధినేత
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాన న్యాయమూర్తి (సీజేపీ) ఖాజీ ఫయీస్ ఈసాపై తనకు నమ్మకం లేదని, జైలులో తనతో దుర్వ్యవహారం ఆగకపోతే నిరాహార దీక్ష చేస్తానని మాజీ ప్రధాని, పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు. రావల్పిండి జైల్లో ఉన్న ఇమ్రాన్ను కలిసిన పార్టీ నేతలు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. జైల్లో ఉన్న తమ అధినేత నిరశన చేపడితేగనుక దేశవ్యాప్తంగా నిరాహార దీక్షల పర్వం తప్పబోదని పీటీఐ నేత షమీమ్ నఖ్వీ హెచ్చరించారు. పీటీఐపై కేసులతో పాటు తనపై కేసులను చేపట్టే ధర్మాసనాల్లో సీజేపీ ఈసా జోక్యాన్ని ఇమ్రాన్ ఖాన్ నిరసించారు. ఆయన ద్వారా తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు. న్యాయ, రాజకీయ బృందాలతో అపాయింట్మెంట్లు రద్దు కావడంపైనా ఇమ్రాన్ నిరాసపడ్డారు. ‘నా పార్టీ బలహీనంగా ఉందని వారు పొరపడుతున్నారు. ఓటర్ల మద్దతున్న ఏ పార్టీ ఎప్పుడు బలహీనపడదు. పీటీఐ పటిష్ఠంగా ఉంది’ అ’ని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. దేశ సమస్యలను ఐఎంఎఫ్ పరిష్కరించలేదని అన్నారు. న్యాయంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడం ద్వారానే సమస్యలకు పరిష్కారం సాధ్యమని చెప్పారు. తాజా ఎన్నికల్లో మోసాల గురించి దేశానికి తెలుసని వ్యాఖ్యానించారు. న్యాయం కోసమే తమ డిమాండ్ అని అన్నారు. ‘ఈ నిరంకుశత్వానికి తలవంచను… అవసరమైతే జైల్లోనే ప్రాణాలు వదిలేస్తాను. తుది వరకూ పోరాడుతూనే ఉంటాను’ అని ఇమ్రాన్ ఖాన్ స్పష్టంచేశారు. దేశ భద్రతను ప్రస్తావిస్తూ అఫ్ఘాన్తో పటిష్ఠ బంధం అవసరమని నొక్కిచెప్పారు. బిలాల్ భుట్టో, విదేశాంగ మంత్రి ఇప్పటివరకు ఆ దేశానికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. అఫ్ఘాన్ ప్రభుత్వ మద్దతు లేకుండా 2,500కిమీల సరిహద్దు వెంబడి టీటీపీపై యుద్ధంలో పాకిస్థాన్ గెలవలేదని ఇమ్రాజ్ ఖాన్ వెల్లడిరచారు.