విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ ఆవరణంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహాం వరకు వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. పేదల కోసం ఆరోగ్యశ్రీ, 108 వంటి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల గుండెల్లో నిలిచి పోయారన్నారు. రైతులకు అన్నదాత పథకం ద్వారా ఏడాదికి 20 వేలు ఇస్తామన్న టిడిపి ప్రభుత్వ హామీ ఏమైందని వారు ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో వైసీపీ రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేస్తుందన్నారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రశేఖర రెడ్డి, మాజీ ఎంపిపి రఘురామ్, దొడ్డిమేకల సర్పంచ్ చంద్రశేఖర్, నాయకులు శివరామిరెడ్డి, ముక్కరన్న, అర్లప్ప, లింగన్న, గాదిరెడ్డి, వీరేష్, అంజినయ్య, శాంతి మూర్తి, ఈరన్న, భీమన్న, ఏసన్న, శివరాం అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.