విశాలాంధ్ర – పెద్దకడబూరు : (కర్నూలు) మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఉన్న రైతుల సమస్యలను పరిష్కరించడంలో తహసీల్దార్ ఘోరంగా విఫలం చెందారని సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ, రాజు విమర్శించారు. మంగళవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో ప్రభుత్వ భూమిలో ఉన్న సర్వేనెంబర్ 174 /1 కి సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో తహసీల్దార్ విఫలం చెందారని ఆరోపించారు. భూమి విషయంలో ఎన్ని సార్లు తహసీల్దార్ పట్టించుకోవడం లేదని, రైతుల, ప్రజల సమస్యలను పరిష్కరించకుండా, నేను ఎన్నికల విధుల్లో భాగంగా డిప్యూటేషన్ పై వచ్చానని అంటూ సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కార్యాలయాన్ని తన సొంత ఇళ్లుగా భావిస్తూ సమస్యలను చెప్పడానికి రైతులు వస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ఎక్కడికి వెళ్లాలని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మండలానికి రెగ్యులర్ తహసీల్దార్ ను నియమించాలని, కల్లుకుంట గ్రామంలో ప్రభుత్వ భూమిని పేద రైతులకు పంచి సాగు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలన్నారు. అలాగే కలెక్టర్ ఆదేశాలను దిక్కరిస్తున్న తహసీల్దార్ ను, పెత్తందారులతో కాసులకు కక్కుర్తి పడిన వీఆర్వో తిప్పన్న లపై చర్యలు తీసుకొని, బదలీ చెయ్యాలని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్, నాయకులు తిక్కన్న, సర్దాజ్ పటేల్, హయాత్ పటేల్, డోలు హనుమంతు, నర్సింహులు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.