– ప్రారంభమైన కూటమి ప్రభుత్వం చర్యలు…
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : వినియోగదారుల వ్యవహారములు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏ.పి. ప్రభుత్వం తగ్గించిన నిత్యావసర సరుకులను ఎంపిక చేసిన కిరాణా దుకాణాల ద్వారా, చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు చేతుల మీదుగా వినియోగదారులకు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ తెలుగుదేశం, బి.జె.పి, జనసేన కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా రోజు రోజుకు పెరిగిపోతున్న నిత్యావసర సరుకుల ధరలకు కళ్లెం వేసిందన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక ప్రజోపయోగ పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని తెలిపారు. కిలో రూ.181 వుండే కంది పప్పు ను రూ.160 లకు, కిలో రూ.56లు, రూ.53 వుండే ఫైన్ రైస్ ను రూ.49, 48లకు అందజేస్తున్నట్లు తెలియజేసారు. ఈ అవకాశాన్ని సామాన్య, మధ్య తరగతి అన్ని వర్గాల ప్రజలు ఉపయోగించుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు, గోవాడ సుగర్స్ మాజీ చైర్మన్ గూనూరు మల్లు నాయుడు, టి.శ్రీనివాసరావు, గూనూరు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.