విశాలాంధ్ర – ధర్మవరం:: పట్టణంలోని శివానగర్ శంకరాపురముకు చెందిన చేనేత కార్మికుడు నీరు గుట్ట నారాయణస్వామి (42 సంవత్సరాలు) అప్పుల బాధతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా చేనేతను నమ్ముకొని తన కుటుంబాన్ని పోషించుకునేవాడు, కరోనా సమయం నుంచి నేటి వరకు నేసిన చీరలకు గిట్టుబాటు కాకపోవడంతో, తెలిసిన చోట, తెలియని చోట కుటుంబ పోషణ కోసం, పిల్లల చదువు కోసం, దాదాపు 8 లక్షలు దాకా అప్పులు చేశాడు. చేనేత పని మగ్గం నేసినా కూడా రేషాలు, వార్పులు, జరీ, ధరలు పెరిగి, గిట్టుబాటు గాక ధర్మవరంలో మగ్గాలు సరిగా నేయక, సంసారం పోషణ, పిల్లల చదువులు, అధిక అప్పులు.. ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో అప్పుల బాధతో మనోవేదనకు గురి కావడం జరిగిందని తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని మృతి చెందడం జరిగిందని తెలిపారు. తదుపరి కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి యజమాని ఉరి వేసుకోవడం జరిగిన ఘటన వారిని ఎంతో బాధించిందని తెలిపారు. మృతునికి భార్య లక్ష్మీదేవితో పాటు, ఒక కుమారుడు అనిల్ కుమార్, కూతురు ప్రణతి ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు, బంధుమిత్రులు తెలుపుతున్నారు.