ఏడు క్యాబినేట్ మీటింగ్ లు పూర్తయిన నిరుద్యోగ సమస్యపై చర్చించకపోవడం బాధాకరం
ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర బాబు
విశాలాంధ్ర -అనంతపురం : రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఎటువంటి ఆంక్షలు లేకుండా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటికి ఏడు క్యాబినెట్ సమావేశాలు పూర్తయినకుడా నిరుద్యోగ సమస్యపై చర్చించకపోవడం బాధాకరమని అఖిలభారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర బాబు విమర్శించారు.
అఖిలభారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ అనంతపురం జిల్లా సమితి ఆధ్వర్యంలో నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరుచూరి రాజేంద్ర మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువకులు అందరికీ నెలకి మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారని అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్న సుమారు ఏడు సార్లు క్యాబినట్ సమావేశాలు నిర్వహించిన నిరుద్యోగ సమస్య గురించి చర్చించలేదనీ నిరుద్యోగ భృతి పై విధివిధానాలు ప్రకటించలేదన్నారు. ఒకపక్క సోషల్ మీడియాలో నిరుద్యోగ భృతి కి ఆంక్షలు అంటూ వార్తలు వీర విహారం చేస్తూ ఉంటే నిరుద్యోగులు భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు గడుస్తున్నా కూటమి పాలనలో నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదని ఏడు సార్లు క్యాబినెట్ సమావేశాలు జరిగిన ఒక్కసారి కూడా నిరుద్యోగ సమస్య మీద ప్రస్తావించకపోవడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి రెండు లక్షల ముప్పై అయిదు వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఎప్పుడు ప్రకటిస్తారో తెలియక నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారని మెగా డీఎస్సీ పేపర్ లకే పరిమితమైందని విమర్శించారు. నిరుద్యోగ యువతకు ఎటువంటి ఆంక్షలు లేకుండా నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు.జిల్లా కార్యదర్శి జి.సంతోష్ కుమార్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి ఎన్నికలు సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని,2.60 లక్షల మంది వాలంటీర్లకు న్యాయం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయిపడ్డ గౌరవ వేతనం ఇవ్వాలని,10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షలు కె.ఆనంద్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ .కుల్లాయి స్వామి జిల్లా సహాయ కార్యదర్శులు ఎం .శ్రీనాథ ఏ .ధను జయ నగర అధ్యక్షుడు శ్రీనివాస్, సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.