విశాలాంధ్ర – పరవాడ (అనకాపల్లి జిల్లా); పరవాడ రెవెన్యూలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను పరిరక్షించాలని గ్రామానికి చెందిన పైల చినక్కు నాయుడు, పైల పైడింనాయుడు(బుజ్జి), గొర్లివానిపాలెం గ్రామానికి చెందిన చిప్పాడ రామారావు తదితరులు రెవెన్యూ అధికారులను కోరారు. ఈ మేరకు బుధవారం పరవాడలో నిర్వహించిన రెవెన్యూ గ్రామ సదస్సులో డిప్యూటీ తహశీల్దార్ సురేష్ నాయుడుకి వినతి పత్రం అందజేశారు. ఈ గ్రామ రెవెన్యూ పరిధిలో నీటి ప్రవాహ భూములు, కొండలు, గుట్టలు, వాగులు, పంట కాలువలు, పాఠశాలల భూములు, రహదారుల స్థలాలు అన్యాక్రాంతం అయ్యాయని వివరించారు. రీ సర్వే పూర్తయిన భూముల్లో చాలా వరకు ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములుగా ఆన్లైన్లో చూపించారని వాటిని సరిచేసి ప్రభుత్వ భూములను కాపాడాలని కోరారు. అలాగే సర్వే నెంబర్ 120/2 లో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భవనాన్ని కూల్చివేసిన కొందరు ఆ స్థలాన్ని ఆక్రమించేందుకు చూస్తున్నారని పిర్యాదు చేశారు. దీనిపైనా అధికారులు స్పందించి ఆ భూమిని స్వాధీన పరుచుకోవడంతో పాటు ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పైలా సత్యనారాయణ, ఎస్.శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.