విశాలాంధ్ర – పరవాడ (అనకాపల్లి జిల్లా); శుద్ధి చేయని ఫార్మా వ్యర్థ జలాలతో పంట కాలువలు, చెరువులను కలుషితం చేస్తున్న రాంకీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. పరవాడ – భరణికం గ్రామాల మధ్య నున్న మొల్లోడు గెడ్డలో ఫార్మా వ్యర్థ జలాలతో తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లుతున్న ప్రాంతాన్ని శుక్రవారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ ఫార్మా వ్యర్థ జలాలను శుద్ధిచేసి సముద్రానికి పంపించవలసి ఉండగా నిబంధనలను ఉల్లంఘించి చెరువులు, గెడ్డలు, పంట కాలవల్లోకి విడుదల చేయడం అన్యాయం అన్నారు. ఫార్మా వ్యర్థ జలాలతో ఇప్పటికే భూగర్భ జలాలు కలుషితం అయ్యాయని పేర్కొన్నారు. తక్షణమే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు భూగర్భ జలాల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తారు. దీనిపై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తున్నట్లు లోకనాథం తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటియు నాయకులు జి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.