–విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.26.06.2024ది. అనకాపల్లి జిల్లాలో తెలుగుదేశం నాయకుల ఆగడాలు మొదలయ్యాయని చోడవరం మండలం లక్ష్మీపురం వైస్ సర్పంచ్ ఎస్. ఆది గణపతి నాయుడు ఆరోపిస్తున్నారు. దీనిపై గణపతి నాయుడు మాట్లాడుతూ లక్ష్మిపురం విశాఖ డైరీ పాల సంఘం డైరెక్టర్ పదవీ కాలం పూర్తయినందున బుదవారం సమావేశానికి రావలసిందిగా చాటింపు వేశారన్నారు. తీరా పాలకేంద్రం వద్దకు వెళ్లేసరికి, సమావేశాన్ని ఎలక్షన్ గా మార్పు చేసిన తెలుగుదేశం నాయకులు వారికి నచ్చిన పేర్లును రాసుకోవడం జరిగిందన్నారు. విశాఖ డైరీ డైరెక్టర్ అయిన దాడి అయిన పవన్, డైరీ అసిస్టెంట్ మేనేజర్ రాము లకు ఈ విషయమై తెలియపరిచి, ఎన్నిక వాయిదా వేయమని కోరినా, ఎటువంటి ప్రయోజనం లేకపోయిందన్నారు. అలానే ఎన్నికల లిస్టు నుండి కొందరు సభ్యులు తో బాటు తన ఓటును తొలగించారని తెలిపారు. ఓటర్లు కు ఎటువంటి పూర్తి సమాచారం లేకపోవడం వలన చాలా మంది రైతులు తిరుగు ముఖం పెట్టి వెళ్లిపోయారన్నారు. పోలీస్ లు వచ్చి పాడి రైతులు మధ్య తగాదాలు ఆపగలిగారు తప్ప, ఆరోపణలు ఎదుర్కొంటున్న డైరెక్టర్ ఎన్నిక ను ఆపలేకపోయారని తెలియజేసారు. ఎటువంటి నోటిఫికేషన్ లేదా నోటీస్ బోర్డులో ఓటర్ లిస్ట్ పెట్టకుండా ఎలక్షన్ జరపడం, గొడవలకు పడడం జరిగిందన్నారు. లక్ష్మీపురం గ్రామంలోను, పాల కేంద్రం వద్ద టి.డి.పి. నేతల నుండి ప్రమాదముందని, చోడవరం పోలీస్ ఉన్నతాధికారులు ప్రజా శాంతి భద్రతలు రక్షించాల్సిందిగా కోరుతున్నారు.