విశాలాంధ్ర – చోడవరం ( అనకాపల్లి జిల్లా) : బ్రెస్ట్ క్యాన్సర్ గుర్తింపు, పరీక్షలు పై చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుదవారం ఉచిత అవగాహన సదస్సును నిర్వహించారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఏ.పి. కమిషనర్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన మరియు పరీక్షల గుర్తింపు కార్యక్రమాన్ని యువరాజ్ సింగ్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో డాక్టర్ తేజస్విని బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉచిత ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.కిరణ్ కుమార్ ప్రారంభించారు. పి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోనే కాకుండా ముఖ్యంగా భారతదేశంలో క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నాయని దీనిపై అవగాహన కొరకు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రోత్సహిస్తున్నారని తెలియజేశారు. ఈ క్యాన్సర్ పైన ముఖ్యంగా విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్త్రీ వైద్యలు టి.చరిత, పి. మాధురి, మధు వర్షిని లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ తేజస్విని మాట్లాడుతూ” స్వస్థ మహిళా స్వస్థ భారత్ “లో భాగంగా ఉచిత క్యాన్సర్ గుర్తింపు కార్యక్రమాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల చోడవరం నందు ప్రారంభించటం చాలా సంతోషదాయకమని ముఖ్యంగా విద్యార్థులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని గ్రామీణ ప్రాంతంలోని తల్లిదండ్రులకు తెలియజేసి కాన్సర్ పరీక్ష ల పై అపోహను పోగొట్టాలని తెలియజేశారు. క్యాన్సర్ తో ఈ మధ్యకాలంలో ఎక్కువగా మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, దీనిని విద్యార్థులు అవగాహన చేసుకోవాలన్నారు.