– ఏ.పి. పారిశ్రామిక మౌలిక కార్పోరేషన్ చైర్మన్ మంతెన రామరాజుతో భేటీ అయిన జనసేన పార్టీ ఇంచార్జి పి.వి.ఎస్.ఎన్. రాజు….
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : చోడవరం నియోజకవర్గంలో పారిశ్రామిక వాడలు నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ మంగళగిరి లోని ఏ.పి. పారిశ్రామిక మౌలిక కార్పోరేషన్ చైర్మన్ మంతెన రామరాజు తో పి.వి.ఎస్.ఎన్.రాజు మంగళవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అభివృద్ధి, ఉపాధి రంగాల్లో వెనుకబడి వున్న చోడవరం నియోజకవర్గంలో పారిశ్రామిక వాడలు నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. నియోజకవర్గంలో కనీసం ఒక్క పరిశ్రమ కూడా లేదని, పరిశ్రమల స్థాపనకు అవసరమయిన వసతులను ఏ.పి.ఐ.ఐ.సి ద్వారా కల్పిస్తే ఇక్కడ ఉన్న యువత తోపాటు మహిళలుకు విస్తృత మయిన అవకాశాలు వస్తాయని, ఈ ప్రాంతం నుండి పారాశ్రామిక వేత్తలు గా తయారు కావడానికి కొంతమందికి అవకాశం కలుగుతుంది అని వారి దృష్టికి తీసుకు వచ్చారు. కూటమి ప్రభుత్వంలో కొన్ని ప్రణాళికలను తప్పక అమలుచేస్తామని వాటిలో చోడవరం నియోజకవర్గం కు అవకాశం కల్పించడానికి సిద్ధమని చైర్మన్ తెలియజేశారు.