గోవాడ- 2 కేంద్రాన్ని సందర్శించిన పి.ఓ. ఉషారాణి
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే. 10.07.2024ది. “అధికారుల నిర్లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాలకు కుళ్లిన కోడిగుడ్లు” అంటూ విశాలాంధ్ర తో సహా పలు తెలుగు దిన పత్రికల్లో బుధవారం వచ్చిన వరుస కథనాలతో ఎట్టకేలకు అంగన్వాడీ ప్రాజెక్టు అధికారులు స్పందించారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని గోవాడ -2 అంగన్వాడీ కేంద్రాన్ని రావికమతం ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్టు పరిధిలోని అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని గోవాడ అంగన్వాడీ కేంద్రం -2 ను పి.ఓ. ఉషారాణి, ఎం.పి.డి.ఒ. రమామణి ఆధ్వర్యంలో అధికారుల బృందం బుదవారం అంగన్వాడీ కేంద్రంను సందర్శించారు. కుళ్ళిన కోడి గుడ్లు సరఫరా పై ఉద్యోగులను ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రాల్లో సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకు రావాలన్నారు. బాలింతలు, గర్భిణీలు, చిన్నపిల్లల్లో రక్త హీనత, హిమోగ్లోబిన్ లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. కాంట్రాక్టర్లు సరఫరా చేసే పౌష్టికాహారం, కోడిగుడ్లు పై అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు నిఘా ఉంచాలన్నారు. పౌష్టికాహార లోపాలపై ఎప్పటికప్పుడు అంగన్వాడీ కార్యకర్తల పర్యవేక్షణ వుండాల్సిందిగా ఆదేశించారు. కుళ్ళిన కోడిగుడ్లు సరఫరా చేసిన కాంట్రాక్టర్ ను వివరణ కోరి, తదుపరి చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అధికారి పుష్ప దేవి, సూపర్వైజర్ అనిత, అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లి తండ్రులు తదితరులు పాల్గొన్నారు.