విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.08.07.2024ది. అధికార నూతన కూటమి ప్రభుత్వం ప్రకటించిన నూతన ఇసుక విధానము ” ఉచితమా, అనుచితమా …???” అనేది రాష్ట్ర ప్రజలకు అర్థం కానీ అంశంగా మారి, పలు ఆందోళనలు కలిగిస్తోంది. ఉచితమంటూ టన్ను ఇసుక ధర రూ.1225 నుండి 1400 పైబడి (ఒక్కో చోట ఒక్కో విధంగా) వెలసిన బ్యానర్లు భవన నిర్మాణ రంగాన్ని మరింత కుదేలు చేసే విధంగా వుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా చిన్న అక్షరాలతో “షరతులు వర్తిస్తాయి ” అన్న విధంగా ఉచిత ఇసుక విధానంలో “ధరల సూచీ “, రవాణా చార్జీలు అదనం అనేది ఆందోళన కలిగించే అంశమని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై అత్యంత ప్రజాదరణ పొందిన టి.డి.పి., జనసేన, బి.జె.పి కూటమి ప్రభుత్వం, ఏ.పి. సి.ఎం., డిప్యూటీ సి.ఎం. పునరాలోచన చేయాలని భవన నిర్మాణ రంగ కార్మిక, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.