ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస
విశాలాంధ్ర – అనంతపురం : ప్రపంచ రక్త దాతల దినోత్సవం పురస్కరించుకొని అనంతపురం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలోని ఓల్డ్ టౌన్ లో ఉన్న రెడ్ క్రాస్ సొసైటీ ఆఫీస్ లో రక్తదాన శిబిరాల నిర్వాహకులకు అభినందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెడ్ క్రాస్ సొసైటీ అనంతపురం బ్రాంచ్ ప్రెసిడెంట్ మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, నగరపాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ మెంబర్ కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్ పర్సన్ కాపు భారతి సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సప్తగిరి క్యాంపర్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో రెడ్ క్రాస్ సొసైటీ ఆవరణలో ఏర్పాటుచేసిన శుద్ధజల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని, రక్తదానం చేసిన ప్రతి ఒక్కరూ హీరోలే అని పేర్కొన్నారు. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తమ వంతుగా రక్తదానానికి ముందుకు వచ్చి రక్తదానం చేయాలన్నారు. అలాగే భవిష్యత్తులో కూడా రక్తదానం శిబిరాలు నిర్వహించి ఎక్కువ మొత్తంలో రక్తం అందించి ప్రాణాపాయంలో ఉన్నటువంటి వాళ్ళకి సకాలంలో రక్తం అందించి ప్రాణాలు కాపాడాలన్నారు. ముఖ్యంగా మహిళలు ప్రసవం సమయంలో రక్తం అందక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, అలాంటి సమయంలో రక్తం అందించి తల్లి, బిడ్డ యొక్క ప్రాణాలను కాపాడాలని పేర్కొన్నారు. అలాగే రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని సీజనల్ వ్యాధుల దృష్ట్యా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను ఎదుర్కోవడానికి అందరూ సంసిద్ధంగా ఉండాలన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్ మాట్లాడుతూ రక్తదానం యొక్క ఆవశ్యకత వివరించి 2024 ప్రపంచ బ్లడ్ డోనర్స్ డే యొక్క ప్రధాన అంశం యొక్క అంశం థాంక్యూ బ్లడ్ డోనర్స్ అని తెలియజేశారు. రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కాపు భారతి మాట్లాడుతూ మీరు దానం చేసే ఒక యూనిట్ రక్తం ద్వారా ముగ్గురు నిండు ప్రాణాలను కాపాడవచ్చన్నారు. రక్తం దానం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారన్నారు.
ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ సంస్థకు తమ వంతుగా సేవలు అందించిన సప్తగిరి కాంపర్ వైస్ ప్రెసిడెంట్ హనీఫ్ ని, జిల్లా వైద్యాధికారి డా.ఈ.బి.దేవి మరియు డి.సి.హెచ్.ఎస్. డా.పాల్ రవికుమార్, డిఎల్ఏటీఓ అనుపమ జేమ్స్ ని, ఆలంబన జనార్ధన్ ని జిల్లా కలెక్టర్ సన్మానించడం జరిగింది. అలాగే గత సంవత్సరం కాలంలో రెడ్ క్రాస్ సొసైటీ యొక్క సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో రక్త దాన శిబిరాలు నిర్వహించిన నిర్వాహకులకు జ్ఞాపికలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ సంస్ధల ప్రతినిధులు, రెడ్ క్రాస్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, రక్త దాతలు, వాలంటీర్లు పాల్గొన్నారు.