విశాలాంధ్ర – అనంతపురం : యూపీఎస్సీ నిర్వహించే ఈపీఎఫ్ఓ & ఈఎస్ఐసి – 2024 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి ఆదేశించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో యూపీఎస్సీ నిర్వహించే ఈపీఎఫ్ఓ & ఈఎస్ఐసి – 2024 పరీక్షలపై వెన్యూ సూపర్వైజర్లు, లోకల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్, డిఆర్ఓ మాట్లాడుతూ యూపీఎస్సీ నిర్వహించే పర్సనల్ అసిస్టెంట్ ఇన్ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) & నర్సింగ్ ఆఫీసర్ ఇన్ ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసి) – 2024 పరీక్షలను జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. యూపీఎస్సీ పరీక్షలను జులై 7వ తేదీన ఆదివారం నిర్వహించడం జరుగుతుందన్నారు. జులై 7వ తేదీన ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు పర్సనల్ అసిస్టెంట్ ఇన్ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) పరీక్ష, మధ్యాహ్నం 2:00 గంటల నుంచి 4:00 గంటల వరకు నర్సింగ్ ఆఫీసర్ ఇన్ ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసి) పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం నిర్వహించే ఈపీఎఫ్ఓ పరీక్షకు 434 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం నిర్వహించే ఈఎస్ఐసి పరీక్షకు 2,109 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. జిల్లా కేంద్రంలో 2 వెన్యూ కేంద్రాలలో ఈపీఎఫ్ఓ పరీక్షను, 6 వెన్యూ కేంద్రాలలో ఈఎస్ఐసి పరీక్షను నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షల కోసం వెన్యూ సూపర్వైజర్ లను, లోకల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్లను, రూట్ ఆఫీసర్ లను నియమించడం జరిగిందని తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని, సిటింగ్ ఏర్పాటు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి కేంద్రానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని, మెడికల్ టీంలు అందుబాటులో ఉంచాలని, ప్రతి కేంద్రాన్ని శుభ్రంగా ఉంచాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి బస్సుల సౌకర్యం కల్పించాలన్నారు. పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశం సెషన్ ప్రారంభానికి 30 నిమిషాల ముందు ముగుస్తుందన్నారు. అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకురావడానికి వీలు లేదన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ, బీసీ వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, డిఎంహెచ్ఓ ఈబి.దేవి, సిపిఓ అశోక్ కుమార్ రెడ్డి, డిఎండబ్ల్యూఓ రామసుబ్బారెడ్డి ఏపీఎంఐపీడీ రఘునాథరెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం సుమంత్, పశుసంవర్ధక శాఖ జెడి సుబ్రహ్మణ్యం, డిఆర్డిఏ పిడి ఈశ్వరయ్య, వెన్యూ సూపర్వైజర్లు, లోకల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.