జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
విశాలాంధ్ర – అనంతపురం : వెలగపూడి, ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి శనివారం పెన్షన్ల పంపిణీ, తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు.
అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, డిఆర్డీఏ పిడి ఈశ్వరయ్య, డీపీఓ ప్రభాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద జూలై ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీకి అన్ని విధాలా సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఒకటో తేదీనే 100 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి కావాలని, ఇందుకోసం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జూలై 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి ఖచ్చితంగా పెన్షన్ల పంపిణీ మొదలు కావాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు పెన్షన్ల పంపిణీ సక్రమంగా జరుగుతుందా లేదా అనేది వారి మండలంలోని కొన్ని ప్రాంతాలను తనిఖీ చేయాలన్నారు. నియోజకవర్గ అధికారులు పెన్షన్ల పంపిణీని ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలన్నారు. పెన్షన్ల పంపిణీ కోసం బ్యాంకుల నుంచి అవసరమైన నగదు పూర్తిగా విత్ డ్రా చేసుకుని పాయింట్ పర్సన్ లకు అప్పగించాలన్నారు. పెన్షన్ల పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని, జిల్లాలో సజావుగా, విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్డిఏ అడ్మిన్ అసిస్టెంట్ అజంతుల్లా పాల్గొన్నారు.