జిల్లా మలేరియా అధికారి డి.ఓబులు
విశాలాంధ్ర – అనంతపురం : జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున సబ్ యూనిట్ అధికారులు అందరూ తమ తమ ప్రాంతాలలో నిత్యం పర్యటిస్తూ వైద్య ఆరోగ్య సిబ్బందిని అప్రమత్తం చేయాలని, ప్రజలు దోమకాటు బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని జిల్లా మలేరియా అధికారి డి.ఓబులు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని డిఎంఓ కార్యాలయంలో సబ్ యూనిట్ అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంఓ మాట్లాడుతూ… జాతీయ కీటక జనిత రోగ నియంత్రణ కార్యక్రమం కింద దోమలు ప్రజారోగ్యానికి ప్రధాన శత్రువులని, దోమల ద్వారా వచ్చే మలేరియా, బోద వ్యాధి, డెంగ్యూ, మెదడువాపు, చికెన్ గునియా వంటి వ్యాధులు రాకుండా జిల్లాలోని అన్ని గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోని సిబ్బందిని మమేకం చేసుకుంటూ గ్రామపంచాయతీ సిబ్బంది సహాయ సహకారాలతో జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాల్సిన బాధ్యత సబ్ యూనిట్ అధికారులపైన ఉన్నదన్నారు. జూన్ మాసమంతా జిల్లాలోని ఏదో ఒక గ్రామంలో ఏదో ఒక చోట మలేరియా వ్యతిరేక మాస ఉత్సవాల ర్యాలీతోపాటు ఆ ప్రాంత ప్రజలకు అవగాహన సమావేశం నిర్వహించాలన్నారు. జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో సాయంకాలంపూట క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయాలన్నారు. అపరిశుభ్రమైన వాతావరణంలో మురికికుంటలలో దోమలకు ఆలవాలమైన చోట ఆయిల్ బాల్స్ వేసి వాటిని నిరోధించాలన్నారు. జిల్లాలో లైనింగ్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని గుర్తించి వివరాలు అందజేయాలన్నారు. జిల్లాలో ఏ ఒక్కరూ సీజనల్ వ్యాధులతో మరణించకుండా ప్రణాళికాబద్ధంగా పలు శాఖల మండల స్థాయి అధికారులతో సబ్ యూనిట్ అధికారులు మమేకమై పనిచేయాలన్నారు. జిల్లాలో అందరూ కలిసికట్టుగా పనిచేసి మలేరియా, డెంగ్యూ వ్యాధులను అరికట్టడానికై వారానికి ఒకసారి మండల స్థాయి అధికారులతో తరచూ సమావేశాలు కావాలన్నారు. జిల్లాలో విస్తృతస్థాయిలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి శుక్రవారం తాను కూడా జిల్లాలో ఏదో ఒక ప్రాంతాన్ని తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. ఇంతకుముందు కేసులు వచ్చిన ప్రాంతాలలో మండల స్థాయి అధికారులు పర్యటించాలని, అక్కడ మలేరియా, డెంగ్యూ వ్యాధులపై విస్తృతంగా అవగాహన కల్పించడానికి సమావేశాలు నిర్వహించాలన్నారు. ఐఈసి యాక్టివిటీలను చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేసి డెంగ్యూ జ్వరం నివారణ పై అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో ఏఎంఓకే సత్యనారాయణ, ఎంపీహెచ్వోలు జి.గిరిధర్ రెడ్డి, రమేష్, బత్తుల కోదండరాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.