సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వి. రాంభూపాల్
విశాలాంధ్ర,ఉరవకొండ (అనంతపురం జిల్లా) : హంద్రీనీవా కాలువ కి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణానికి అంచనాలను తయారు చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులను ఆదేశించడం అభినందనీయమని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వి. రాంభూపాల్ అన్నారు. మంగళవారం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే హంద్రీనీవా కాలువను వెడల్పు చేసి పదివేల క్యూసెక్కుల నీటిని తీసుకొస్తామని ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోవాలన్నారు. నిత్యం కరువుతో సతమతమౌతున్న అనంతపురం జిల్లా రైతులకు అదనపు నీరు తీసుకోవడానికి హంద్రీనీవా కాలువ ఒకటే మార్గం అన్నారు. పదివేల క్యూసెక్కుల నీటిని తీసుకు రాగలిగితే జిల్లాకు 70 టీఎంసీల నీరు వస్తుందని దీనివల్ల జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చు అన్నారు. హెచ్.ఎల్.సి కాలువ ఆధునీకరణ చేయకపోవడం వల్ల తుంగభద్ర డ్యామ్ లో నీరు ఉన్నప్పటికీ కూడా అదనంగా తీసుకోలేకపోతున్నామన్నారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హంద్రీనీవా కాలువ వెడల్పు చేసి 6300 క్యూసెక్కుల నీటిని తీసుకొస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా హంద్రీనీవా కాల్వను లైనింగ్ కాకుండా వెడల్పు చేయాలని పేర్కొన్నారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పై రైతులకు ఆశలు అంచనాలు ఎక్కువగా ఉన్నాయని దానికి అనుగుణంగా మంత్రి కృషి చేయాలన్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లావ్యాప్తంగా అనేక రకాల పంటలు దెబ్బతిన్నాయని నష్టపోయిన అరైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బాల రంగయ్య, బి. శ్రీనివాసులు, స్థానిక సిపిఎం పార్టీ నాయకులు రంగారెడ్డి మధుసూదన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.