జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ
విశాలాంధ్ర- అనంతపురం : భారీ వర్షం కురిసిన దృష్ట్యా నగరం శివారు ప్రాంతంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పర్యటించారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరదనీరు రావడంతో మంగళవారం రూరల్ పరిధిలోని ఉప్పరపల్లి, జగనన్న కాలనీ, ఆటోనగర్, విన్సెంట్ డీ పాల్ స్కూల్ తదితర ప్రాంతాల్లో జాయింట్ కలెక్టర్ పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. వారికి అవసరమైన ఆహార పొట్లాలను, నిత్యవసర వస్తువులు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వసంతబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.