అనంత ఆర్.అండ్.బి అతిథి గృహంలో “ప్రజాదర్బార్” కార్యక్రమాన్ని నిర్వహించిన మంత్రి
విశాలాంధ్ర – అనంతపురం : “ప్రజాదర్బార్” సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం అనంతపురం నగరంలోని ఆర్.అండ్.బి అతిథి గృహంలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు “ప్రజాదర్బార్” కార్యక్రమాన్ని మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తోందన్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన వెంటనే అక్కడికక్కడే సంబంధిత శాఖల అధికారులతో మంత్రి ఫోన్ ద్వారా మాట్లాడారు. ఎలాంటి ఆలస్యం కాకుండా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.