జిల్లా ఎస్పీ గౌతమిసాలి
విశాలాంధ్ర -అనంతపురం : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజలు అందజేసే ఫిర్యాదులను అలసత్వం లేకుండా చట్ట పరిధిలో పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ గౌతమిసాలి పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన నాణ్యతగా పరిష్కారం చూపాలనే రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం మేరకు జిల్లా ఎస్పీ గారు ఈరోజు స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్ ( ప్రజా సమస్యల పరిష్కార వేదిక ) కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలమూలల నుండీ వచ్చిన ప్రజల నుండీ ఎస్పీ 114 ఫిర్యాదులు స్వీకరించారు. పిటీషనర్లతో ముఖాముఖి మాట్లాడారు. లోతుగా వారి సమస్యలను విని అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేసి సదరు ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భార్యాభర్తల గొడవలు, కుటుంబ సమస్యలు, రస్తా వివాదాలు, తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఆర్ విజయభాస్కర్ రెడ్డి, జి.రామకృష్ణ, ఎస్బీ సి.ఐ ఇందిర, తదితరులు పాల్గొన్నారు.