ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి
విశాలాంధ్ర -అనంతపురం : ప్రభుత్వ వైద్య కళాశాలలో పని చేసే పారిశుద్ధ్య కార్మికుల బకాయి ఉన్న వేతనాలు వెంటనే ఇవ్వాలని లేని పక్షంలో దశలవారి ఆందోళనలకు పూనుకుంటామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి హెచ్చరించారు.
మంగళవారం ప్రభుత్వ వైద్య కళాశాలలో పని చేసే పారిశుద్ధ్య కార్మికులకు బకాయి ఉన్న 4 నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలని పనులు బందు చేసి వైద్య కళాశాల ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది,
ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు జిఓ నెం 549 ప్రకారం జోన్ 1,2 లల్లో జూన్ నెల నుండి 16 వేల రూపాయల వేతనం ఇస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ 1 స్పెషలిటిస్ వారు కొత్త వేతనం ఇవ్వకపోగా 4 నెలల వేతనాన్ని బకాయి పెట్టడం సరికాదన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు 4 నెలల నుండి వేతనాలు ఇవ్వకపోతే వారి కుటుంబ పోషణ ఏ విధంగా జరుగుతుందన్నారు,ఇంటి అద్దెలు కట్టలేని పరిస్థిలో ఉన్నారన్నారు. పిల్లలను చదివించుకోలేని పరిస్థితిలోకి నెట్టబడ్డారన్నారు. కాంట్రాక్టర్లు ఈ పి ఎఫ్ , ఈ ఎస్ ఐ కూడా సరిగ్గా జమచేయడం లేదన్నారు,ప్రభుత్వ సెలవులు కూడా ఇవ్వట్లేదన్నారు. కార్మికులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న కార్మికుల గురించి ప్రిన్సిపల్,అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. బకాయి ఉన్న వేతనాలను వెంటనే ఇవ్వాలని లేని పక్షంలో సామూహికంగా సెలవులు పెడతామని హెచ్చరించారు,
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్,నగర ప్రధాన కార్యదర్శి కృష్ణుడు,మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకటేష్,నారప్ప,ప్రశాంత్,లక్ష్మిదేవి,ఫామీదా,అసీనా,గంగా తదితరులు పాల్గొన్నారు…