విశాలాంధ్ర-తాడిపత్రి (అనంతపురం జిల్లా): పట్టణంలోని యల్లనూరు రోడ్డు సర్కిల్లో ఉన్న వాల్మీకి మహర్షి విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, వాల్మీకి సంఘం నాయకుడు సూర్యముని ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటగా వాల్మీకి మహర్షి విగ్రహం చుట్టూ మావిడాకులు, టెంకాయ పట్టలతో ముస్తాబు చేసి, వాల్మీకి మహర్షి విగ్రహానికి పురోహితుడు చేత స్నానమాచరింపచేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. వాల్మీకి మహర్షి విగ్రహానికి జేసీ ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వాల్మీకి మహర్షి రామాయణం రచించి, భారతదేశ సంస్కృతిని, కట్టుబాట్లను అందించిన మహాకవి అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, వాల్మీకి సంఘం నాయకులు కులస్తులు పాల్గొన్నారు. అలాగే సజ్జల దిన్నె గ్రామంలో వాల్మీకి సంఘం నాయకులు నాగ రంగయ్య, ఓబులేసు, బాలయ్య చేతుల మీదుగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి కులస్తులు పాల్గొన్నారు.